డ్యాన్స్ బార్లలో సీసీటీవీ కెమెరాలు : మహా సర్కార్ ను వివరణ కోరిన సుప్రీం
న్యూఢిల్లీ : డ్యాన్స్ బార్లలో మహిళల నృత్యాలకు సంబంధించి.. సుప్రీం కోర్టుకు మహారాష్ట్రకు ప్రభుత్వానికి మధ్య వాదనలు నడుస్తున్నాయి. 2005లో మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన డ్యాన్స్ బార్లను.. 2013లో సుప్రీం కోర్టు తిరిగి పునరుద్దరించిన సంగతి తెలిసిందే.
అయితే.. డ్యాన్స్ బార్లలో అశ్లీల నృత్యాలకు తావు లేకుండా ఉండడం కోసం.. మహారాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలను అమలులోకి తీసుకొచ్చింది. డ్యాన్స్ బార్లలో ఖచ్చితంగా సీసీటీవీలను ఏర్పాటు చేయడం.. అలాగే మహిళలు నృత్యాలు చేస్తున్నప్పుడు వాళ్లపై డబ్బులు విసరడంపై నిషేధం.. ఇవీ మహారాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన నిబంధనలు.
మహారాష్ట్ర ప్రభుత్వం విధించిన ఈ ఆంక్షలను సవాల్ చేస్తూ.. ఇండియన్ హోటల్, రెస్టారెంట్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో ప్రభుత్వానికి హోటల్ అసోసియేషన్ లకు మధ్య వాదనలు జరిగాయి. డ్యాన్స్ బార్లలో నృత్యాలు చేసే మహిళలపై డబ్బులు విసరడం.. మహిళలను భారతీయ సంస్కృతిని కించపరిచే చర్య అని మహారాష్ట్ర ప్రభుత్వం వాదించింది.
దీనికి ప్రతిగా వాదన వినిపించిన హోటల్ అసోసియేషన్స్ తరుపు న్యాయవాది జయంత్ భూషణ్ .. నృత్యాలు చేసే మహిళలపై డబ్బులు విసరడం టిప్ ఇవ్వడంతో సమానమని వాదించారు. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతోనే ఏకీభవించిన కోర్టు, పిటిషనర్ తరుపు వాదనను తప్పుబట్టింది.
కాగా, 2013లో సుప్రీం ఇచ్చిన తీర్పుకు విరుద్దంగా.. డ్యాన్స్ బార్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్న మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై, పిటిషనర్ అభ్యంతరాలకు ఆరు నెలల్లోగా వివరణ ఇవ్వాల్సిందిగా మహారాష్ట్ర సర్కార్ ను ఆదేశించింది కోర్టు.