మహారాష్ట్ర ఎటిఎస్ చేతికి ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులు
బెంగళూరు: బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్న అనుమానిత ఉగ్రవాదులను విచారణ చెయ్యడానికి మహారాష్ట్ర పోలీసులు సిద్దమయ్యారు. పరప్పన అగ్రహార జైలులో ఉన్న సయ్యద్ లక్నా, సద్దాం ఖాన్ అనే ఇద్దరిని బాడి వారెంట్ మీద మహారాష్ట్ర తీసుకు వెళ్లారు.
మహారాష్ట్ర ఏటీఎస్ అధికారులు ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను కట్టుదిట్టమైన భద్రతతో తీసుకు వెళ్లారని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎం.ఎన్. రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
పూణెలో జరిగిన బాంబు పేలుడు కేసు దర్యాప్తు చేస్తున్న మహారాష్ట్ర ఏటీఎస్ అధికారులకు సయ్యద్ లక్నా, సద్దాం ఖాన్ ల మీద అనుమానం ఉందని అందుకే విచారణ నిమిత్తం వారిని తీసుకు వెళ్లారని అన్నారు. వీరిద్దరిని అరెస్టు చేసిన సమయంలో సంఘటనా స్థలంలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని ఎం.ఎన్.రెడ్డి అన్నారు.
2014 డిసెంబర్ 28వ తేదిన ఇక్కడి ఎంజీ రోడ్డు సమీపంలోని చర్చి స్ట్రీట్ దగ్గర జరిగిన బాంబు పేలుడు కేసు ఎన్ఐఏకి అప్పగిస్తారా అని విలేకరులు ప్రశ్నించగా ఎం.ఎన్. రెడ్డి స్పందించారు. కేసు దర్యాప్తు ఎన్ఐఏకి అప్పగించడం తమ పరిధిలో లేదని, రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంటుందని సమాదానం ఇచ్చారు.
ఇప్పటికే చర్చి స్ట్రీట్ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు నాలుగు రాష్ట్రాలకు వెళ్లి దర్యాప్తు చేసి అక్కడి పోలీసు అధికారులతో చర్చించి వివరాలు సేకరించారు. నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని బెంగళూరు పోలీసు అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. విలేకరుల సమావేశంలో జాయింట్ పోలీసు కమిషనర్ చంద్రశేఖర్, డీసీపీ రమేష్ తదితరులు పాల్గోన్నారు.