మహిళను చితకబాదుతూ కెమెరాకు చిక్కిన పోలీస్: నెట్లో హల్చల్
ముంబై: దొంగతనం ఆరోపణ పైన ఓ మహిళను పోలీసు సిబ్బంది ఒకరు చితకబాదిన సంఘటన సామాజిక మాధ్యమంలో హల్ చల్ చేస్తోంది. 35 ఏళ్ల మహిళను పోలీసులు ఇష్టారీతిగా కొట్టారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ సంఘటన మహారాష్ట్రలోని జల్గావ్లో జరిగింది.
ఫిబ్రవరి 21వ తేదీన జల్గావ్లోని చాలీస్గావ్ బస్టాండులో ఓ మహిళ పక్కనున్న మరో మహిళ మెడలో ఉన్న బంగారు హారాన్ని దొంగతనం చేసేందుకు ప్రయత్నం చేసింది. బాధితురాలు గట్టిగా అరిచింది. దీంతో పక్కనే ఉన్న పోలీసు నాయక్ శశికాంత్ జగన్నాథ్ మహాజన్ బాధితురాలిని చితకబాదాడు.
అనంతరం ఆమెను చాలీస్ గావ్ పోలీసు స్టేషన్కు తీసుకు వెళ్లాడు. తర్వాత ఆమెను వదిలేశారు. పోలీసు ఆమెను కొడుతున్న సమయంలో కొందరు వీడియో తీశారు. దానిని సామాజిక మాధ్యమాలలో పెట్టారు. మహాజన్ ఓ మహిళను అలా కొట్టడంపై విచారణ సాగుతోంది.
సదరు మహిళ దొంగతనం చేసేందుకు ప్రయత్నించిందని పోలీసు స్టేషన్ ఇంఛార్జ్ మనోహర్ జాదవ్ చెప్పారు. అయితే, మహిళను కొట్టిన పోలీసు కానిస్టేబుల్ పైన ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా అని ప్రశ్నిస్తే.. విచారణ కొనసాగుతోందని చెప్పారు. మిగతా విషయాలు చెప్పేందుకు నిరాకరించారు.