గోడలు కట్టండి: రామ్లీల-రాసలీలపై యోగి సంచలన నిర్ణయం
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాలనలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇప్పటికే పలు సంస్కరణలు తీసుకొచ్చిన యోగి.. తాజాగా హిందూ ఆలయాలపై ఆదేశాలను జారీ చేశారు.
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాలనలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇప్పటికే పలు సంస్కరణలు తీసుకొచ్చిన యోగి.. తాజాగా హిందూ ఆలయాలపై ఆదేశాలను జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని హిందూ దేవాలయాల చుట్టూ పటిష్టమైన గోడలను నిర్మించాలని, ఆలయాల్లో మౌలిక వసతులను మెరుగుపర్చాలని ఆదేశించారు.
చర్యలు చేపట్టండి
రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులతో సమావేశమైన సీఎం యోగి.. హిందూ ప్రార్థనాలయాలు, పవిత్ర స్థలాలల్లో మౌలిక వసతులు కల్పించడంతోపాటు రక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. జూన్ 2018లోగా అయోధ్యలో ‘భజన్ సంధ్య' కేంద్రాన్ని నిర్మించాలని, చిత్రకూట్ చుట్టూ ప్రదక్షిణ మార్గం పరిక్రమను పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందుకోసం రూ. 14.77 కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు.
వసతులు కల్పనకు ఆదేశం
ప్రముఖ దేవాలయాలకు ఉన్న మార్గాలను నాలుగు లైన్ల రహదారులుగా మార్చడం, భక్తులకు అవసరమైన మరుగుదొడ్లు, విశ్రాంతి గదులు, మంచినీటి వసతులు కల్పించాలని సీఎం యోగి ఆదేశించారు.
రామ్లీల-రాసలీల
అంతేగాక, ఎన్నో ఏళ్లుగా ఆగిపోయిన ప్రపంచ ప్రసిద్ధ ‘రామ్ లీల'ను ఆయోధ్యలోనూ జరిపించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మధురలో ‘రాసలీల' తిరిగి ప్రారంభించాలని సూచించారు. దేవాలయాలకు సమీపంలో ఉన్న పుష్కరణిలను తక్షణమే శుభ్రపర్చాలని ఆదేశించారు.
సాంకేతికత కల్పన
కాశీవిశ్వేశ్వరుని ఈ-పూజ, ఈ-డొనేషన్ వంటి సౌకర్యాలను కల్పించాలని సాంకేతిక విభాగాన్ని ఆదేశించారు. కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లాలని భావించే వారు ఆన్లైన్లో దరఖాస్తులు పంపేలా చర్యలు చేపట్టాలని సూచించారు.