ఆ రాష్ట్రంలో 2 వేల మంది గూండాలు.. అందరినీ అరెస్టు చేయమన్న సీఎం
సినీనటి కిడ్నాప్, లైంగిక వేధింపుల వార్తల నేపథ్యంలో.. రాష్ట్రంలో ఉన్న గూండాలందరినీ అరెస్టు చేయమంటూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదేశాలు జారీ చేశారు.
తిరువనంతపురం: రాష్ట్రంలో ఉన్న గూండాలందరినీ అరెస్టు చేయమంటూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదేశాలు జారీ చేశారు. తాజాగా ఓ సినీనటి కిడ్నాప్, లైంగిక వేధింపుల వార్తల నేపథ్యంలో సీఎం ఈ విధంగా స్పందించినట్లు తెలుస్తోంది.
కేరళ రాష్ట్ర పోలీసు ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం ఆ రాష్ట్రంలో మొత్తం 2010 మంది గూండాలు ఉన్నారు. మొత్తం 14 జిల్లాల్లో వీళ్లందరిపై కేసులు నమోదై ఉన్నాయి. రెండ్రోజుల క్రితం ఎర్నాకుళంలో ఓ సినీనటి విషయంలో జరిగిన ఘటన రాష్ట్రాన్ని వేడెక్కించింది.
ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఆ రాష్ట్ర హోంశాఖ పోర్టుఫోలియో కూడా సీఎం విజయన్ దగ్గరే ఉంది. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్రంలోని సంఘ విద్రోహ శక్తులను కఠిన చట్టాల కింద అరెస్టు చేయాలని, ఇప్పటికైనా హోం శాఖను సీఎం ఇతరులకు అప్పగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో సీఎం విజయన్ కూడా తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. నెల రోజుల సమయం ఇస్తున్నానని, రాష్ట్రంలో ఉన్న గూండాలందరినీ అరెస్టు చేయాలంటూ తాజాగా పోలీసు అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.