బ్యాంకులు సరే.. మా మాటేమిటి?: మాల్యా రూ.300 కోట్ల బాకీ
రూ.9వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టి బ్రిటన్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యా అరెస్ట్, విడుదల కలకలం రేపింది. మాల్యాను రప్పించేందుకు మరో ఏడాది పడుతుందని చెబుతున్నారు.
న్యూఢిల్లీ: రూ.9వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టి బ్రిటన్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యా అరెస్ట్, విడుదల కలకలం రేపింది. మాల్యాను రప్పించేందుకు మరో ఏడాది పడుతుందని చెబుతున్నారు. ఆయన రాక కోసం బ్యాంకులే కాదు, కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్లో పని చేసే ఉద్యోగులు కూడా వేచి చూస్తున్నారు.
కింప్ ఫిషర్ ఉద్యోగులతో పాటు ఇప్పటికీ కంపెనీ పే రోల్స్లో ఉన్న ఉద్యోగులు వేచి చూస్తున్నారు. దాదాపు మూడువేల మంది ఉద్యోగులకు వేతన బకాయిలు, గ్రాట్యుటీల కింద దాదాపు రూ.300 కోట్లుు మాల్యా చెల్లించాల్సి ఉంది.
బ్యాంకుల వద్ద మరిన్ని రుణాలు తీసుకొని జీతాల బకాయిలు చెల్లించడంతో పాటు కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ను పునరుద్ధరిస్తానని విజయ మాల్యా చాలాకాలం పాటు ఉద్యోగులకు మాయమాటలు చెప్పారు. చివరకు డబ్బులు ఇవ్వకుండానే లండన్ వెళ్లిపోయారు.
పలువురికి జీతాలు రావాలి
2012, సెప్టెంబర్ 30వ తేదీన కింగ్ ఫిషర్ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఇందులో సీనియర్ మేనేజర్గా పని చేసి, 2012, నవంబర్ నెలలో రాజీనామా చేసిన అనిరుధ్ బల్లాల్ తనకు కంపెనీ నుంచి ఏడు నెలల జీతం బకాయిలు రావాలని మీడియాకు తెలిపారు.
నాడు మాల్యా చేతులెత్తేశాడు
ఆయన ఇప్పుడు ముంబైలోని ఏర్క్రాఫ్ట్ గ్రౌండ్ హాండ్లింగ్ కంపెనీలో పని చేస్తున్నారు. 2013, జూన్ 8న ఎయిర్లైన్స్ లైసెన్స్ను పునరుద్ధరించేందుకు భారత విమానయానం డైరెక్టర్ జనరల్ నిరాకరించడంతో ఇక తాను ఉద్యోగులకు బకాయిలు కూడా చెల్లించలేనని మాల్యా చేతులెత్తేశారు.
సంతోషం ఆవిరి
చాలామంది కింగ్ ఫిషర్ ఉద్యోగులకు ఉద్యోగాలు దొరక్క చాలాకాలం ఇదే కంపెనీలోనే ఉండిపోయారు. ఇప్పటికీ ఉద్యోగాలు దొరకని వారు ఉన్నారు. విజయ మాల్యాను లండన్లో అరెస్ట్ చేశారని తెలిసి ఎంతో సంతోషించానని, అంతలోనే ఆయనకు బెయిల్ కూడా లభించిందని తెల్సి నిరుత్సాహానికి గురయ్యానని కింగ్ఫిషర్ కంపెనీలో ఫ్లైట్ సర్వీసు డైరెక్టర్గా పని చేసిన నీతు శుక్లా చెప్పారు.
మా గురించి మాట్లాడరా?
ఆమె 2014, డిసెంబర్ నెలలో కంపెనీకి రిజైన్ చేశారు. ఆమెకు మూడేళ్ల బకాయిలు రావాలి. విజయ మాల్యా గురించి ప్రభుత్వం మాట్లాడినప్పుడల్లా ఆయన బ్యాంకులకు ఎగవేసిన రుణాల గురించే మాట్లాడుతుంది తప్ప బాధిత ఉద్యోగుల గురించి మాట్లాడిన సందర్భం లేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె ప్రస్తుతం రియల్ ఎస్టేట్ కంపెనీలో పని చేస్తున్నారు.
నష్టపోయాం
కింగ్ఫిషర్ కంపెనీలో సిస్టమ్స్ మేనేజర్గా పని చేసిన రజనీ జైన్ ఇప్పటికీ ఎక్కడా ఉద్యోగం చేయడం లేదు. తాము ఇల్లు కొనేందుకు ప్లాన్ చేసుకొని అడ్వాన్సు చెల్లించిన మూడు, నాలుగు నెలలకే ఎయిర్ లైన్స్ మూతపడిందని, ఫలితంగా తాము ఇల్లు కొనే ఆలోచనను వదులుకున్నామని చెప్పారు. దీని వల్ల తాము అడ్వాన్స్గా చెల్లించిన సొమ్మును నష్టపోవాల్సి వచ్చిందన్నారు.
విదేశాల్లోని ఉద్యోగులకు అలా.
2016-17 ఆర్థిక సంవత్సరం వరకు కూడా భారత్లోని కంపెనీ పే రోల్స్లో 900 మంది ఉద్యోగులు ఉన్నారని ఆమె తెలిపారు. విదేశీ చట్టాలు కఠినంగా ఉండడం వల్ల విదేశాల్లోని ఉద్యోగులకు కంపెనీ మూతపడినందుకు నష్టపరిహారం కూడా కంపెనీ చెల్లించిందని, ఇక్కడి వారికి జీతం బకాయిలు కూడా చెల్లించలేదని ఆమె వాపోయారు.