దమ్ముంటే సీబీఐ కేసులు పెట్టండి: మమతా బెనర్జీ
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరో సారి పరోక్షంగా కేంద్రంలోని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. మీకు వ్యతిరేకంగా మాట్లాడితే సీబీఐ కేసులు పెడుతామని బెదిరిస్తారని, ఆ కేసులకు ఇక్కడ ఎవ్వరూ భయపడరని ఆమె అన్నారు.
గురువారం ఓ సమావేశంలో ఆమె ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. దేశంలో అసహన పరిస్థితులున్నాయంటూ బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను ఆమె సమర్థించారు. ఒక భారతీయుడిగా ఆయన తన మనస్సులోని మాట చెప్పారని అన్నారు.
అందుకే మీరు అమీర్ ఖాన్ ను దేశం విడిచి పాకిస్థాన్ వెళ్లిపోవాలని అంటున్నారని, అస్సలు ఆ మాటలు చెప్పడానికి మీరెవరు అని ప్రశ్నించారు. ఈ దేశం అందరిది, ఇక్కడే అందరూ జన్మించారు, ఇక్కడే మరణిస్తారని మమతా బెనర్జీ చెప్పారు.
మేము ఏం తినాలో మీరే చెబుతున్నారు, మేము ఏం మాట్లాడాలో మీరు సూచిస్తున్నారు, అస్సలు మాకంటూ ఓ వ్యక్తిత్వం ఉండదా అని ప్రశ్నించారు. రాజకీయాలలో పిరికిపందలా మాట్లాడటం తనకు చేతకాదని మమతా బెనర్జీ అన్నారు.
తాన మీద సీబీఐ కేసులు పెట్టుకుంటే పెట్టుకోవచ్చని పరోక్షంగా కేంద్ర ప్రభుత్వానికి మమతా బెనర్జీ సవాలు విసిరారు. ఉగ్రవాదానికి కుల, మత విశ్వాసాలు ఉండనే ఉండని, ఉగ్రవాదులు ఎప్పుడూ ఉగ్రవాదులే అని మమతా బెనర్జీ చెప్పారు.