ఆదుకోండి: మోడీని తొలిసారి కలిసిన మమతా, ‘ఘర్ వాపసీ’ అని లెఫ్ట్
న్యూఢిల్లీ: భారత ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తొలిసారి ఆయనను సోమవారం కలిశారు. అప్పుల్లో వున్న తమ రాష్ట్రాన్ని గట్టెక్కిక్కించేందుకు ఆర్థిక సహాయం చేయాలని ప్రధానమంత్రిని ఆమె కోరినట్లు తెలుస్తోంది.
దీనిపై మోడీ నుంచి సానుకూల స్పందన లభించనట్లు సమాచారం. అయితే కోల్ బ్లాక్స్ వేలంలో, క్లీన్ గంగ ప్రచారంలో రాష్ట్రానికి ప్రాధాన్యత ఇస్తామని హామీ యిచ్చినట్టు తెలుస్తోంది. కాగా, రాష్ట్రంలో భారీ అప్పుల్లో ఉన్న విషయం వాస్తవమేనని ప్రధాని అంగీకరించారని.... ఈ విషయాన్ని తాను పరిశీలిస్తానని మోడీ హామి ఇచ్చినట్లు సమావేశం తర్వాత మమత వెల్లడించారు.
ప్లానింగ్ కమిషన్ స్థానంలో ఏర్పాటుచేసని నీతి ఆయోగ్ మొదటి సమావేశానికి కనీసం తన ప్రతినిధిని కూడా పంపని మమత బెనర్జీ తాజాగా ప్రధానమంత్రిని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూసేకరణ బిల్లును కూడా మమతా బెనర్జీ వ్యతిరేకించిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉండగా ప్రధాని మోడీని మమతా బెనర్జీ కలవడంపై పశ్చిమబెంగాల్ వామపక్ష నేతలు తీవ్రంగా స్పందించారు. సిబిఐ బారి నుంచి తప్పించమని అడిగేందుకే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మోడీని కలిశారని ఆరోపించారు. లేదంటే సొంత గూటి(ఘర్ వాపసీ)లో చేరేందుకే కలిశారేమోనని అనుమానం వ్యక్తం చేశారు.