భార్య, బిడ్డలను నిద్రలోనే చంపేసి ఆత్మహత్య
ఉత్తరప్రదేశ్: కుటుంబ సమస్యల కారణంగా జీవితంపై విరక్తి చెందిన వ్యక్తి భార్య, బిడ్డలను చంపేసి అతను ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఒకే కుటుంబంలో అందరూ అంతం కావడంతో ఆ ప్రాంతంలో విషాదచాయలు నెలకొన్నాయి.
ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావో జిల్లాలోని పాంచ్ కుల ప్రాంతంలో నీరజ్ (30), రాజ్ కుమారి (27) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి నవిత (5), శివాని (2), అనన్య (7 నెలలు) అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
ముగ్గురూ కుమార్తెలే పుట్టారని నీరజ్ దిగులు పెంచుకున్నాడు. అతని కుటుంబ సభ్యులతో పాటు బంధువులు చాల సార్లు నీరజ్ కు ధైర్యం చెప్పారు. ఎంత మంది ధైర్యం చెప్పినా నీరజ్ దిగులుతో కుంగిపోయాడు.
గురువారం రాత్రి నిద్రపోతున్న భార్య రాజ్ కుమారి గొంతు నులిమి హత్య చేశాడు. తరువాత ముగ్గురు బిడ్డలను గొంతులు బిగించి హత్య చేశాడు. అదే ఇంటిలో నీరజ్ సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
శుక్రవారం నీరజ్ కుటుంబ సభ్యులు ఒక్కరు కూడ బయటకు రాకపోవడంతో పక్కనే ఉన్న బంధువులు వెళ్లి చూడగా విషయం వెలుగు చూసిందని, నీరజ్ బంధువులు ఫిర్యాదు చేశారని పోలీసులు చెప్పారు. కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.