మహిళా ప్రొఫెసర్ ను చంపేసి రేప్: ఉరి శిక్ష
కోయంబత్తూరు: మహిళా ప్రొఫెసర్ ను దారుణంగా హత్య చేసి తరువాత ఆమె మీద లైంగిక దాడి చేసిన నిందితుడికి తమిళనాడులోని కోయంబత్తూరు మహిళా కోర్టు ఉరి శిక్ష విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది.
తిరునల్వేలీ జిల్లా తెన్ కాశీకి చెందిన మహేష్ (30) అనే శాడిస్టుకు కోర్టు ఉరి శిక్ష విధించింది. కోయంబత్తూరు జిల్లా కారమడై సమీపంలోని అశిరియర్ కాలనీలో రమ్య (24) అనే యువతి నివాసం ఉంటున్నది.
కనుత్తుకడవులోని ఓ ప్రయివేట్ కాలేజ్ లో రమ్య అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తోంది. 2014 నవంబర్ 30వ తేది సాయంత్రం కాలేజ్ లో విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరింది. ఆ సందర్బంలో మహేష్ ఆమెను వెంబడించాడు.
తరువాత రమ్య భయపడి ఇంటిలోకి వెళ్లిపోయింది. బలవంతంగా ఇంటిలో చొరబడిన మహేష్ పెద్ద కర్ర తీసుకుని రమ్య, ఆమె తల్లి మాలతీలపై దాడి చేశాడు. ఇద్దరు సృహతప్పి పడిపోయారు. తరువాత నిందితుడు ఇద్దరి శరీరం మీద, ఇంటిలో ఉన్న బంగారు నగలు లూటీ చేశాడు.
చనిపోయిన రమ్య మీద అత్యాచారం చేసి అక్కడి నుంచి పరారైనాడు. కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేసి 2015 జనవరిలో మహేష్ ను అరెస్టు చేశారు. కోర్టులో ఇతను నేరం చేసినట్లు రజువు అయ్యింది.
రమ్యను హత్య చేసినందుకు ఉరి శిక్ష, అనుమతి లేకుండా ఇంటిలోకి చొరబడినందుకు ఆరు ఏళ్ల జైలు శిక్ష, అత్యాచారం చేసినందుకు యావజ్జీవ శిక్ష, రూ. 25,000 జరిమానా విధిస్తూ కోయంబత్తూరు మహిళా కోర్టు సంచలన తీర్పు చెప్పింది.