6 నెలల పాటు అక్క అస్తిపంజరంతో నివాసం: వ్యక్తి దగ్ధం
అక్క అస్తిపంజరంతో కలిసి ఆరు నెలల పాటు జీవించి ఉండడం ద్వారా వార్తల్లోకి ఎక్కిన వ్యక్తి మంగళవారంనాడు శవమైన కనిపించాడు.
కోలకత్తా: ఆరు నెలల పాటు అక్క అస్తిపంజరంతోనూ, రెండు పెంపుడు కుక్కల శవాలతోనూ సహవాసం చేయడం ద్వారా 2015లో పార్థా డే అనే వ్యక్తి పతాక శీర్షికలకు ఎక్కాడు. అతను మంగళవారం కాలిపోయి కనిపించాడు. రెండు నెలల క్రితం 45 ఏళ్ల డే హోం నుంచి విడుదలయ్యాడు.
ఆ తర్వాత అతను ఓ ఫ్లాట్లో ఒంటరిగా జీవిస్తూ వచ్చాడు. బహుశా అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని సీనియర్ పోలీసు అధికారులు అంటున్నారు. అతని శవం కోల్కతాలోని వాట్గుండే స్ట్రీట్లో గల బాత్రూంలో పడి ఉంది. డే శవం పక్కన పెట్రోల్ సీసా, మ్యాచ్ బాక్స్ కనిపించాయి.
పక్కింటి వారు ఫిర్యాదు చేయడంతో తాము ఫ్లాట్కు చేరుకుని చూసే సరికి అతని శవం బాత్రూంలో పడి ఉందని పోలీసులు చెప్పారు. అతను పెట్రోల్ పోసుకుని తగులబెట్టుకుని ఉంటాడని, అయితే ఆ విషయం ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమని పోలీసులు అంటున్నారు
పోస్టుమార్టం నివేదిక కోసం వేచి చూస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు 2015 జూన్ 10వ తేదీన డే అక్క అస్తిపంజరాన్ని, రెండు కుక్కల శవాలను చూశారు. డే తండ్రి అరబింద డే మృతిపై దర్యాప్తు చేస్తుండగా అవి బయటపడ్డాయి.
మంటలు వస్తున్నాయనే సమాచారం అందడంతో వెళ్లిన పోలీసులకు అరబింద శవం రాబిన్సన్ స్ట్రీట్లోని అతని ఇంటి బాత్రూంలో కనిపించింది. ఆ సమయంలోనే నిరాహార దీక్ష కారణంగా మరణించిన అక్క దేవజాని అస్తిపంజరంతో డే కలిసి ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె అవివాహిత కూడా. డే గదిలో రెండు పెంపుడు కుక్కల శవాలు కూడా కనిపించాయి.
మానసిక వైకల్యానికి డే పావ్లోవ్ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. అతను బాగయ్యాడని భావించిన తర్వాత అతన్ని ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ చేశారు.