మణిపూర్: మోడీ హవా బీజేపీని గట్టెక్కిస్తుందా?
వచ్చేనెలలో జరిగే మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీకి మధ్య హోరాహోరీ జరుగుతాయని భావిస్తున్నారు. కానీ బీజేపీ, దాని మిత్రపక్షాలకు మాత్రం సీఎం అభ్యర్థి లేరు.
ఇంఫాల్: వచ్చేనెలలో జరిగే మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీకి మధ్య హోరాహోరీ జరుగుతాయని భావిస్తున్నారు. కానీ బీజేపీ, దాని మిత్రపక్షాలకు మాత్రం సీఎం అభ్యర్థి లేరు. కేవలం ప్రధాని మోదీ హవా మీదే ఆధారపడి బరిలోకి దిగుతున్నాయి.
ఇతర పార్టీలు కూడా బరిలోకి దిగుతున్నా ప్రధాన పోటీ మాత్రం బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉంటుంది. సీఎం అభ్యర్థిత్వాన్ని ప్రకటించకున్నా ప్రధాని నరేంద్రమోదీ, ఆయన సుపరిపాలనే ప్రధాన ఎజెండాగా ఎన్నికల ప్రచారంలోకి వెళుతున్నామని, సీఎం అభ్యర్థిత్వాన్ని ప్రకటించాల్సిన అవసరమేమిటని బిజెపి మణిపూర్ అధ్యక్షుడు కే భాబానందా సింగ్ పేర్కొన్నారు.
సీఎం అభ్యర్థిత్వంపై తమ పార్టీ జాతీయ నాయకత్వం మాత్రమే సమాధానం చెప్పగలదని తెలిపారు. తమ రాష్ట్రంలో నాయకులకు కొదవ లేదని భాబానందా సింగ్ తెలిపారు. అసోంలో 15 ఏళ్ల కాంగ్రెస్ అసమర్థ పాలనకు బిజెపి చరమగీతం పాడినట్లే మణిపూర్లోనూ బిజెపి అధికారం చేపడుతుందని భాబానంద సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. మూడింట రెండొంతుల మెజారిటీతో విజయం సాధిస్తుందన్నారు.
విడిగా బీజేపీ పోటీ
మిత్రపక్షాలైన నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పిపి), నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పిఎఫ్), లోక్ జనశక్తి పార్టీ (ఎల్జెపీ)తో నిమిత్తం లేకుండా బిజెపి విడిగా పోటీ చేస్తోంది. 60 స్థానాల మణిపూర్ అసెంబ్లీలో 21 నియోజకవర్గాల్లో, ఎల్జెపీ 11, ఎన్పీఎఫ్ 15 అసెంబ్లీ సెగ్మెంట్లలో అభ్యర్థులను నిలిపింది. 'మేం కేంద్రంలో ఎన్డీయే మిత్రపక్షాలం. ప్రాంతీయ పార్టీలుగా మా ఆకాంక్షలు మాకుంటాయి. సొంతంగా గెలుపొందగలమని బిజెపి విశ్వాసంతో ఉంది' అని ఎన్ పిపి ప్రధాన కార్యదర్శి వివేక్ రాజ్ వాంగ్ ఖెమ్ చెప్పారు.
రాష్ట్ర స్థాయి సమీకరణాలే వేరన్న కమలనాథులు.. ఇది ప్రజలను మోసగించే ఎత్తుగడ అని కాంగ్రెస్
జాతీయ స్థాయిలో కూటమిలో భాగమైనా రాష్ట్ర స్థాయిలో రాజకీయ సమీకరణాలు విభిన్నమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బాబానంద సింగ్ చెప్పారు. తమ రాజకీయ వ్యూహాలు కూడా విభిన్నంగా ఉన్నాయని చెప్పారు. విడివిడిగా పోటీ చేయడం ద్వారా బిజెపి దాని మిత్ర పక్షాలు ప్రజలను మోసగిస్తున్నాయని అధికార కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించారు. ఒకవైపు యునైటెడ్ నాగా కౌన్సిల్ (యుఎన్సి)తో ఆర్థిక దిగ్బంధంతో ప్రజలను అష్ట కష్టాల పాల్జేస్తున్న బిజెపి.. ఎన్నికల్లో ఎన్పిఎఫ్ విడివిడిగా పోటీ చేయడం ద్వారా ప్రజలను మోసగిస్తున్నదని, కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నదని మణిపూర్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి విద్యాపతి సేజమ్ చెప్పారు.
జిల్లాల విభజనే కీలకం
సదర్ హిల్స్లో ఏడు జిల్లాలను విడదీయడంతో మణిపూర్ రాష్ట్ర రాజకీయాలు సమూలంగా మారిపోయాయి. దీనికి ప్రతిగానే యుఎన్సి ఆర్థిక దిగ్బంధంతో ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత తేవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. 65 శాతం మణిపూర్ జనాభాలో ఇంఫాల్ లోయలో జీవిస్తోంది. గిరిజనేతర మీటీలు మూడున్నర నెలలుగా దిగ్బందంతో ఇబ్బందుల పాలవుతున్నారు. 60 సీట్లలో 40 ఇంపాల్ లోయలోనే ఉన్నాయి. ఏ పార్టీ విజయం సాధించాలన్నా ఇంఫాల్ వ్యాలీయే కీలకం. కొండ ప్రాంతాల్లో మరో 20 స్థానాలు ఉన్నాయి.
వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు జిల్లాల విభజన: ప్రకాశ్ జవదేకర్
మణిపూర్ సీఎం ఇబోబిసింగ్ తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఏడు జిల్లాలను విభజించారని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆరోపించారు. నాగాలాండ్లో బిజెపి మిత్ర పక్షం.. నాగాలాండ్ ప్రజాస్వామ్య కూటమిలోని ఎన్పిఎఫ్.. మణిపూర్లో విడిగా పోటీ చేయడం మంచి పరిణామం కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ అస్త్రంగా 'ఎన్ఎస్సిఎన్ (ఐఎం)తో కేంద్రం' ఒప్పందం
ఈశాన్య ప్రాంతంలో శాంతి స్థాపనకు ఎన్ఎస్సిఎన్ (ఐఎం)తో ఒప్పందం కుదుర్చుకున్న కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నది. ఒకవేళ బిజెపి గెలుపొందితే ప్రాదేశిక సమగ్రతతో రాజీ పడాల్సి వస్తుందని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. కానీ ఇది ఆధార రహితమని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కొట్టి పారేశారు. వచ్చేనెల నాలుగో తేదీ, ఎనిమిదో తేదీల్లో రెండు దశల్లో వేర్వేరుగా పోలింగ్ జరుగుతోంది.
డజన్కి పైగా సీట్లలో ముస్లింలే కీలకం
ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా మణిపూర్లోనూ ముస్లింలే కీలక పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్రంలో 9% మంది ముస్లింలు ఉన్నారు. వారిని పంగల్, మీటీ పంగల్ అనే పేర్లతో పిలుస్తారు. 3 - 4 సీట్లకు పైగా ఓటు బ్యాంక్ కీలకం, ఏడెనిమిది సీట్లలో కంటే నిర్ణయాత్మక శక్తిగా ఉన్నది. 1970వ దశకంలో మీటీల సామాజిక వర్గానికి చెందిన వారే సీఎంలుగా ఉన్నారు. ముస్లింలు సంప్రదాయంగా కాంగ్రెస్, మణిపూర్ పీపుల్స్ పార్టీకి మద్దతు పలుకుతుంటారు.
ముస్లింలకు టిక్కెట్ల కేటాయింపులో కాంగ్రెస్, బిజెపి ఒక్కటే
కానీ మణిపూర్ పీపుల్స్ పార్టీ కేవలం మూడు స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తోంది. మిగతా స్థానాల్లో గెలుపొందాలని కాంగ్రెస్ పార్టీ కలలు కంటున్నది. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించింది కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని ప్రభుత్వం. వారికి ఉన్నత విద్యావకాశాల కల్పనకు కూడా చర్యలు తీసుకున్నది. కానీ బీజేపీ ముస్లింలకు ఒక్కరికి మాత్రమే టిక్కెట్లు కేటాయించింది. కాంగ్రెస్ పార్టీ కూడా కేవలం ముగ్గురికి మాత్రమే సీట్లు కేటాయించింది.