గాలి సోదరులపై చర్యలు వద్దన్నారు: కాంగ్రెస్పై భరద్వాజ్ నిప్పులు
న్యూఢిల్లీ : బళ్లారి గాలి జనార్ధన్ రెడ్డి బ్రదర్స్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీ.ఎస్. యడ్యూరప్పల మీద కొంత మంది కాంగ్రెసు నాయకులు జాలి చూపించారని, వారిపై చర్యలు తీసుకోవద్దని తనకు సూచించారని కర్ణాటక మాజీ గవర్నర్, కేంద్ర మాజీ మంత్రి హంసరాజ్ భరద్వాజ్ ఆరోపించారు. ఆ కాంగ్రెసు నాయకులు బిజెపితో స్నేహసంబంధాల్లో ఉన్నారని ఆయన అన్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో ఆయన ఈ విషయాలు వెల్లడించారు.
గత వారం రోజులుగా హెచ్ఆర్ భరద్వాజ్ కాంగ్రెస్ అధిష్టానం మీద అయన ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తాను కర్ణాటక గవర్నర్ గా ఉన్న సమయంలో అక్కడి ప్రజల క్షేమం గురించి ఆలోచించి పలు నిర్ణాయాలు తీసుకున్నానని అన్నారు.
బళ్లారి గాలి జనార్దన్ రెడ్డి బ్రదర్స్, అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి బీ.ఎస్. యడ్యూరప్ప అధికారం అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడ్డారని భరద్వాజ్ చెప్పారు. అప్పుడు తాను కర్ణాటక గవర్నర్గా ఉన్నానని గుర్తు చేశారు. ఆ సమయంలో బళ్లారి గాలి బ్రదర్స్, యడ్యూరప్ప మీద చర్యలు తీసుకోవడానికి తాను సిద్దం అయ్యానని అన్నారు.
ఆ సమయంలో కాంగ్రెస్ అధిష్టానంలోని పలువురు నాయకులు తనను సంప్రదించి బళ్లారి బ్రదర్స్, యడ్యూరప్పల మీద ఎలాంటి చర్యలు తీసుకోరాదని ఒత్తిడి తీసుకు వచ్చారని ఆరోపించారు. అయినా తాను లెక్క చెయ్యకుండా గాలి బ్రదర్స్, యడ్యూరప్పల మీద విచారణ చెయ్యాలని ఆదేశాలు జారీ చేశానని అన్నారు.
అప్పుడు విచారణ జరిగినందు వలన వారు అవినీతికి పాల్పడ్డారనే విషయం వెలుగు చూసిందని, అందుకే బీజేపీ ప్రభుత్వం పడిపోయిందని అన్నారు. తరువాత జరిగిన శాసన సభ ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. ఈ రోజు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందంటే అది తన పుణ్యమే అని అన్నారు. అంతేగానీ కర్ణాటకలో కాంగ్రెస్ చేసిన సేవలు చూసి ప్రజలు ఓట్లు వెయ్యలేదని, తాను తీసుకున్న నిర్ణయాల వలన బీజేపీకి గట్టి దెబ్బ తగిలిందని అన్నారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు బోగ్గు స్కాంలో సంబంధం ఉందని కోర్టు సమన్లు అందడం చాలా బాధ కలిగించిందని భరద్వాజ్ అన్నారు. యుపీఏ-2లో చాల స్కాంలు జరిగాయని, ఆస్కాంల గురించి సోనియా గాంధీకి అన్ని తెలుసు అని భరద్వాజ్ ఆరోపించారు.
యుపీఏ-2 ప్రభుత్వం అనేక కుంనకోణాలకు పాల్పడిందని అందుకే లోక్ సభ ఎన్నికలలో 44 సీట్లకు పడిపోయిందని భరద్వాజ్ అన్నారు. గాంధీ కుటుంభానికి విధేయుడైన హెచ్ఆర్ భరద్వాజ్ యుపీఏ-1 ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పని చేశారు. గత 10 రోజుల నుండి కాంగ్రెస్ నాయకుల మీద ఈయన మండిపడుతున్నారు.