విస్తుపోయే నిజం.. పెళ్లయిన మూడేళ్లకు భార్యకు షాక్
గుర్గావ్ : మూడేళ్ల కాపురం తర్వాత ఓ భార్య తన భర్త అసలు స్వరూపాన్ని తెలుసుకుంది. తనను ప్రేమ పెళ్లి చేసుకున్న అతగాడికి అంతకుముందే ఓ భార్య, కొడుకు ఉన్నారని తెలిసి మోసపోయానని గ్రహించింది. విషయం కాస్త పోలీస్ స్టేషన్ మెట్లక్కడంతో.. సదరు భర్తపై సెక్షన్ 376(రేప్), 420(చీటింగ్) కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.
వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్ఘర్ లోని జాస్పుర్ కి చెందిన ఓ యువతి గత కొంతకాలంగా గుర్గావ్ లో బీపీఓగా పనిచేస్తోంది. ఇదే క్రమంలో.. ఉత్తరప్రదేశ్ లోని మహారాజ్ గంజ్ కు చెందిన సహోద్యోగి అలోక్ మోరియాతో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. దీంతో 2013మార్చిలో ఓ గుడిలో ఆమె మెడలో మూడు ముళ్లు వేశాడు అలోక్. అప్పటినుంచి ఇద్దరు కలిసే ఉంటున్నారు.
అయితే ఇటీవల భర్త ప్రవర్తనలో స్పష్టమైన మార్పును ఆమె గమనించింది. తరుచూ ఫోన్ కాల్స్ రావడం.. తన కంట పడకుండా భర్త దొంగచాటుగా ఫోన్ లో మాట్లాడడుతుండడంతో.. ఎక్కడో అనుమానం మొదలైంది. దీంతో విషయంపై ఆరా తీయగా... అప్పుడు గానీ అసలు నిజం బయటపడలేదు. తనకు అప్పటికే పెళ్లయి, ఓ బిడ్డ కూడా ఉందని అంగీకరించాడు అలోక్. దీంతో మోసపోయానని తెలుసుకున్న ఆమె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.