ఆ యూనివర్సిటీలో మాంసాహారం బంద్..
లక్నో : దేశంలో తినే ఆహారంపై కూడా ఆంక్షలు అమలవుతున్నాయి. తాజాగా లక్నో లోని అంబేడ్కర్ యూనివర్సిటీలొ మాంసాహారంపై నిషేధం విధించింది వర్సిటీ యాజమాన్యం. ఇకనుంచి యూనివర్సిటీ మెస్ లో పూర్తిగా శాఖాహారమే వడ్డిస్తారని, ప్రత్యేక సందర్భాల్లో కూడా మాంసాహారానికి అనుమతి లేదని తేల్చి చెప్పారు వర్సిటీ అధికార ప్రతినిధి కమల్ జైస్వాల్.
అయితే ఈ నిర్ణయానికి ప్రొఫెసర్ కంచె ఐలయ్య ప్రసంగమే కారణమని చెప్తున్నారు వర్సిటీ అధికారులు. గత నెల 14న హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ప్రసంగిస్తూ గొడ్డు మాంసం ఆరోగ్యానికి చాలా మంచిదన్న వ్యాఖ్యలు చేశారు ఐలయ్య. అనంతరం అంబేడ్కర్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో మాంసాహారంపై నిషేధం విధించడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు వర్సిటీ వైస్ ఛాన్సలర్.
కాగా.. వర్సిటీలో మాంసాహార నిషేధాన్ని వ్యతిరేకిస్తూ దాదాపు 200 మంది విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. మాంసాహార నిషేధం దళిత మైనారిటీ వ్యతిరేకమని ఆరోపించిన విద్యార్థులు.. నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే వర్సిటీ అధికారుల తీరును కాంగ్రెస్ తప్పుబడుతుండగా, బీజేపీ మాత్రం వర్సిటీ నిర్ణయాన్ని సమర్ధిస్తోంది.