యూపీని వణికిస్తోన్న 'టెర్రర్': చొరబడ్డ ఉగ్రవాదులు!, బిచ్చగాడితో బెదిరింపు లేఖ
ఇప్పటికే మూడు వాహనాల్లో ఉగ్రవాదులు ఉత్తరప్రదేశ్ లో దిగిపోయారని, అందులో కొంతమంది ఘజియాబాద్ చేరుకున్నారని, మరికొంతమంది ఢిల్లీకి చేరుకున్నారని లేఖలో ఉగ్రవాదులు పేర్కొన్నారు.
లక్నో: పరిస్థితులు చూస్తుంటే ఉగ్రవాదులు ఉత్తరప్రదేశ్ ను టార్గెట్ చేసినట్లుగానే కనిపిస్తోంది. ఇటీవల ఐసిస్ తో సంబంధాలున్న ఓ ఉగ్రవాదిని పోలీసులు మట్టుబెట్టిన దగ్గరి నుంచి ఏదో ఒక రూపంలో ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా ఉగ్రవాదుల నుంచి మీరట్ పోలీసులకు ఓ బెదిరింపుల లేఖ అందింది.
ఆశ్చర్యంగా ఆ బెదిరింపు లేఖను ఓ బిచ్చగాడితో ఉగ్రవాదులు పోలీసులకు చేరవేయడం గమనార్హం. లేఖను పోలీసులకు చేరవేసేందుకు గాను ఉగ్రవాది తనకు రూ.10 ఇచ్చినట్లు బిచ్చగాడు తెలిపాడు. కాగా, లేఖను చదివిన పోలీసులు షాక్ తిన్నారు.
తాజ్మహల్ను టార్గెట్ చేసిన ఐసిస్: పేల్చేస్తామని హెచ్చరిక!..
ఇప్పటికే మూడు వాహనాల్లో ఉగ్రవాదులు ఉత్తరప్రదేశ్ లో దిగిపోయారని, అందులో కొంతమంది ఘజియాబాద్ చేరుకున్నారని, మరికొంతమంది ఢిల్లీకి చేరుకున్నారని లేఖలో ఉగ్రవాదులు పేర్కొన్నారు. లేఖను తేలిగ్గా తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.
ఇదిలా ఉంటే, మంగళ్ పాండేకు చెందిన ఒక మహిళతో స్థానిక యువకులు కొంతమంది పీసీఆర్ స్టేషన్ కు మరో బెదిరింపు లేఖను చేరవేశారు. సాయుధులైన కొంతమంది జిహాదీలు ఉదయం 6,7, 8గం. సమయంలో దాడులకు తెగబడనున్నారని ఆ లేఖలో పేర్కొనడం గమనార్హం. బ్రహ్మపురి సర్కిల్ ఆఫీసర్ ధర్మేంద్ర చౌహాన్ ఈ బెదిరింపు వార్తను ధ్రువీకరించారు.
కాగా, ఉత్తరప్రదేశ్ పోలీసులకు బెదిరింపులు రావడం ఇదేం తొలిసారి కాదు. బుధవారం నాడు సైతం తూర్పు యూపీలోని పూర్వాంచల్ ప్రాంతంపై దాడులకు తెగబడుతామంటూ కొన్ని బెదిరింపు లేఖలు పోలీసులకు అందాయి. వరుస బెదిరింపు లేఖలతో అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం భద్రతను మరింత పటిష్టం చేసే ఏర్పాట్లలో మునిగిపోయింది.