పాక్కు షాక్-దటీజ్ భారత్ పారా కమాండోస్: ప్లాన్గా ఇలా దాడి చేస్తారు..
న్యూఢిల్లీ: ఎల్వోసీ వద్ద ఉగ్రవాద స్థావరాల పైన భారత ఆర్మీ సర్జికల్ దాడులు నిర్వహించి ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ సంఘటనతో అందరు ఉలిక్కి పడ్డారు. పారా కమాండోలు ఈ పనిని చేశాయి. దీంతో ప్రపంచం దృష్టిని మన పారా కమాండోలు ఆకర్షించారు.
పారా కమాండోలకు సైన్యంలో ప్రత్యేక స్థానముంది. ఎంపిక నుంచి శిక్షణ వరకు ప్రతి దశలో కఠినమైన వడపోత అనంతరం కమాండోలను ఎంపిక చేస్తారు. 1966లో ప్రత్యేకంగా దీనిని పారాచూట్ రెజిమెంట్గా ఏర్పాటు చేశారు. ఎన్నో కీలక దాడుల్లో ఈ దళం తమ సత్తా చాటింది.
1978లో వీటిని ప్రత్యేక దళాలుగా మార్చారు. పదాతి దళంలోని పారాచూట్ రెజిమెంట్ ప్రత్యేక దళాల్లో అతి పెద్దది. వీరి శిక్షణ కాలం మూడున్నరేళ్లు ఉంటుంది. నిత్యం వీరి శక్తిసామర్థ్యాలకు పదును పెడుతుంటారు. ఇది ప్రపంచంలోనే తొలి ఎయిర్ బార్న్ యూనిట్లలో ఒకటిగా నిలిచింది.
బార్డర్ అవతల ఉన్న శత్రువులను ఈ దళాలు వ్యూహాత్మకంగా మట్టుబెడతాయి. శత్రు సైన్యం ప్రాధాన్యతా రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసి, మిగతా సైన్యంకు సులభతరం చేసేందుకు పారా కమాండోలను ఉపయోగిస్తారు. వీరి వద్ద అత్యాధునిక ఆయుధాలు ఉంటాయి.
1971లో భారత్ - పాక్ యుద్ధంతో వీరి సత్తా తొలిసారి వెలుగు చూసింది. ఆరుగురు జట్టు సభ్యుల బృందం పాక్లో 240కి.మీ. లోపల ఇండస్, చార్చో ప్రాంతంలోకి చొరబడి మెరుపుదాడులు నిర్వహించి 473 మందిని హతమార్చింది. శత్రుదేశ శతఘ్నులను ధ్వంసం చేసి పాక్ ఎస్ఎస్జీ సిబ్బందిని బందీలుగా పట్టుకున్నారు. వైమానిక స్థావరాన్ని ధ్వంసం చేశారు.
శ్రీలంకలోని మూలై ప్రాంతంలో పారా కమాండోలు హెలికాప్టర్లను ఉపయోగించి చేసిన దాడిలో 200 మంది ఎల్టీటీఈ సభ్యులు మృతి చెందారు. 1999లో పది పారాచూట్ బెటాలియన్లలో తొమ్మిది కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నాయి. ఇలా పలు ఆపరేషన్లలో పాల్గొన్నాయి.