ఈ బిచ్చగాడు కోటీశ్వరుడు: వ్యాపారులకే అప్పులు!
పాట్నా: అతుడు పేరుకే బిచ్చగాడు. రోజూ బిచ్చమెత్తుకుంటూ జీవిస్తాడు. కానీ, అతడి ఆస్తులు చూస్తే మాత్రం బిత్తర పోవాల్సిందే. ఎందుకంటే అతని స్థిరాస్థి విలువ రూ. 1.25కోట్లు. విశేషమేమిటంటే అతను అడుక్కున్న వ్యాపారస్తులకే లక్షల్లో అప్పులిస్తాడతడు. అతనే బీహార్ రాష్ట్రానికి పాట్నాకు చెందిన పప్పూ కుమార్.
బీటెక్ చదివి ఇంజనీర్ కావాలనుకున్న పప్పూ యాదవ్.. పరిస్థితులు అతడ్ని బిచ్చగాడిగా మార్చాయి. అయినా అతడు కోటిశ్వరుడయ్యాడు. అతనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. పప్పూ యాదవ్ చిన్నప్పుడూ అందరిలాగే స్కూల్కు వెళ్లాడు. ఇంటర్ కూడా పాసయ్యాడు. గణితమంటే మక్కువ ఎక్కువ. అన్నిటికన్నా అందులోనే అతడికి 72 మార్కులు వచ్చాయి. దీంతో ఇంజినీర్ కావాలనుకున్నాడు.
కానీ, ఓ ప్రమాదం అతడి జీవితాన్ని మలుపు తిప్పింది. పాక్షికంగా పక్షవాతం వచ్చింది. ఆ తర్వాత తండ్రి చనిపోయాడు. ఇంట్లో వాళ్లు పప్పూను పట్టించుకోవడం మానేశారు. చివరికి గతిలేక పాట్నా రైల్వేస్టేషన్లో అడుక్కోవడం మొదలుపెట్టాడు. అప్పుడే ఏడేళ్లు గడిచిపోయాయి.
అయితే, 2015 సంవత్సరంలో ఓ రోజున రైల్వే పోలీసులు స్టేషన్లో బిచ్చగాళ్లను తరిమేయడం మొదలుపెట్టారు. కానీ, పప్పూ కుమార్ మాత్రం అక్కడ్నుంచి కదల్లేదు. దీంతో పోలీసులు అతని గురించి ఆరా తీశారు. అసలు విషయం ఏమిటంటే.. రూపాయి రూపాయి దాచిన అతడు ఒక్కోటి 2వేల చదరపు అడుగుల విస్తీర్ణమున్న రెండు ప్లాట్లు కొన్నాడు.
అతడికున్న 4 బ్యాంకు ఖాతాల్లో లక్షల రూపాయలు.. వడ్డీలకు అప్పులిస్తున్న విషయం బయటపడింది. దీంతో పోలీసులు 'ఇంత డబ్బుంది కదా.. మామూలు జీవితం జీవించు' అని అతనికి చెప్పారు. అయితే పప్పూ కుమార్ వారి మాట వినలేదు. ఆ పక్షవాతానికైనా చికిత్స చేయించుకోవచ్చు కదా అని చెబితే.. తాను చికిత్స చేయించుకుంటే.. ఇక తనకు బిచ్చమెవరు వేస్తారు అని ఎదురు ప్రశ్నించడం గమనార్హం.