అన్నాడీఎంకె 'ఐటీ' హెచ్చరిక: శశికళపై దుష్ప్రచారం చేస్తే.. ఇక అంతే!
అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శి శశికళపై దుష్ప్రచారానికి చెక్ పెట్టేందుకు అన్నాడీఎంకె ఐటీ శాఖను రంగంలోకి దింపారు.
చెన్నై: సుప్రీం తీర్పుతో జైలు శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోంది. కొంతమంది పనిగట్టుకుని మరీ ఆమెపై వ్యతిరేక ప్రచారం చేస్తుండటంతో అన్నాడీఎంకె ఐటీ శాఖ రంగంలోకి దిగింది.
ముఖ్యంగా బుధవారం నాడు ఆమె జైల్లో అడుగుపెట్టిన తర్వాత చాలామంది ఆమెపై సోషల్ మీడియాలో సెటైర్స్ వేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన కొన్ని మీమ్స్ కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఫోటోలను మార్ఫింగ్ చేసి, కొన్ని సినిమా చిత్రాలను జోడించి శశికళపై నెటిజెన్స్ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
ఈ వ్యవహారంతో పార్టీకి నష్టం జరుగుతుందని అన్నాడీఎంకె నేతలు భావిస్తున్నారు. దీంతో ఇలాంటి దుష్ప్రచారానికి చెక్ పెట్టేందుకు అన్నాడీఎంకె ఐటీ శాఖను కూడా రంగంలోకి దింపారు. శశికళకు వ్యతిరేకంగా మీమ్స్ను రూపొందిస్తున్న వారిపై చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటామని అన్నాడీఎంకే ఐటీ విభాగం హెచ్చరికలు జారీ చేసింది.
సోషల్ మీడియాలో శశికళపై దుష్ప్రచారం చేస్తున్నవారి మీద దృష్టి పెట్టాలని అన్నాడీఎంకె ఐటీ శాఖ భావిస్తోంది. కాగా, సీఎం పదవిపై ఆశలు పెట్టుకుని భంగపడ్డ పన్నీర్ సెల్వమే ఈ దుష్ప్రచారం చేయిస్తున్నారని ఐటీ విభాగం ఆరోపిస్తోంది.
సోషల్ మీడియాలో శశికళపై దుష్ప్రచారం చేసినవారిలో ఇప్పటిదాకా 180మందిని గుర్తించినట్లుగా అన్నాడీఎంకె ఐటీ విభాగం తెలిపింది. వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని ప్రకటించింది.