తెర పైకి అన్నాడీఎంకె 'విలీనం': శశికళకు కోలుకోలేని దెబ్బ!
అమ్మ పాలన తిరిగి కొనసాగాలని, రెండాకుల చిహ్నం తిరిగి దక్కించుకోవాలనేదే తమ అందరి అభిప్రాయమని మంత్రులు తెలిపారు.
చెన్నై: తమిళ రాజకీయాల్లో మరో ఉత్కంఠకు తెరలేచింది. అన్నాడీఎంకె అనిశ్చితి రాజకీయాలు ఎటువైపుగా సాగుతాయోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఏరికోరి తెచ్చుకున్న దినకరన్ తన మెడకే ఉచ్చు బిగిస్తాడని శశికళ ఊహలో కూడా అనుకోని ఉండకపోవచ్చు.
అమ్మ అస్తమయం తర్వాత పన్నీర్ సెల్వంను ధీటుగా ఎదుర్కొని మరీ పార్టీని తన పక్షాన నిలుపుకున్న చిన్నమ్మకు.. తాజా పరిణామాలు ఎంతకీ మింగుపడటం కష్టమే. జైల్లో ఉన్నా.. పార్టీని తన కనుసన్నుల్లో నడిపించాలని భావించిన శశికళకు దినకరన్ దెబ్బ మామూలుగా తగలలేదు.
విలీనమయ్యే సూచన:
చివరాఖరికి.. రెండుగా చీలిపోయిన అన్నాడీఎంకె వర్గాలు ఇప్పుడు మళ్లీ కలిసిపోయే పరిస్థితి ఏర్పడింది. పన్నీర్-చిన్నమ్మ మధ్య చీలిపోయిన రెండు వర్గాలను ఒక్కటి చేసే విషయమై సీఎం పళనిస్వామి ఆధ్వర్యంలో సోమవారం నాడు కేబినెట్ భేటీ జరిగింది. భేటీ అంశాలు బయటకు పొక్కనప్పటికీ.. విలీన అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
కేబినెట్ లో చర్చ:
కేబినెట్ భేటీ అనంతరం.. రాత్రి బాగా పొద్దుపోయాక సీనియర్ మంత్రులంతా మరోసారి భేటీ అవడం గమనార్హం. గ్రీన్ వేస్ రోడ్డులోని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కె.తంగమణి అధికారిక నివాసంలో వీరంతా విలీనంపై చర్చలు జరిపారు. భేటీ అనంతరం మంత్రులు మాట్లాడిన తీరును బట్టి చూస్తే.. అన్నాడీఎంకెలో రెండు వర్గాలు ఒకే గూటికి కిందకు చేరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
సమైక్యంగానే ముందుకెళ్తాం:
డిప్యూటీ స్పీకర్ తంబిదురై మాట్లాడుతూ.. పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. సమైక్యంగా పార్టీని ముందుకు నడిపే విషయంపై ఆలోచించామని, విలీనంపై పన్నీర్ సెల్వం ఆలోచనతో మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఏకీభవించారని ఆయన తెలిపారు.
అమ్మ పాలన తిరిగి కొనసాగాలని, రెండాకుల చిహ్నం తిరిగి దక్కించుకోవాలనేదే తమ అందరి అభిప్రాయమని మంత్రులు తెలిపారు. పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ దినకరన్ బెంగుళూరులో ఉన్నందునా.. ఆయన రాగానే ఈ విషయంపై చర్చిస్తామని న్యాయశాఖ మంత్రి సి.వి.షణ్ముగం అన్నారు. ఇదిలా ఉంటే, అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా మంగళవారం చెన్నైకి రావాలని సీఎం నుంచి ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది.
శశికళకు కోలుకోలేని దెబ్బ:
సీఎం పీఠానికి దగ్గరగా వచ్చి.. చివరాఖరికి జైలు పాలై, కనీసం పార్టీనైనా గుప్పిట్లో ఉంచుకోగలిగాను అని భావించిన శశికళకు.. జరుగుతున్న పరిణామాలు పెద్ద దెబ్బ అని చెప్పాలి. పన్నీర్ వర్గంతో పళినస్వామి వర్గం చేతులు కలిపితే.. దినకరన్, శశికళ, ఇద్దరి పోస్టులు ఊడిపోవడం ఖాయం. అటు ప్రజల్లోను ఇప్పటికే కావాల్సినంత అప్రతిష్ట మూటగట్టుకున్న శశికళ ఈ దెబ్బతో రాజకీయంగా ఇక 'సున్నా'గా మారే అవకాశం లేకపోలేదు.