ఎంఎస్జీ సినిమా: 9 మంది సెన్సార్ బోర్డు సభ్యుల రిజైన్పై వెంకయ్య
ఢిల్లీ/కడప: సెన్సార్ బోర్డును కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆదివారం నాడు మండిపడ్డారు. కడపలో సాయంత్రం భారతీయ జనతా పార్టీ బహిరంగ సభను ఘనంగా నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా పలువురు జిల్లా నేతలు వెంకయ్య సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు.
కాగా, సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డులో రాజీనామాల పర్వం కొనసాగింది. సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఒత్తిళ్లు, జోక్యం చేసుకుంటోందని ఆరోపిస్తూ బోర్డు చైర్పర్సన్ లీలా శ్యాంసన్ తన పదవికి రాజీనామా చేశారు. చైర్పర్సన్ బాటలో తొమ్మిది మంది బోర్డు సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు.
డేరా సచ్ఛా సౌద చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్ నటించిన మెసెంజర్ ఆఫ్ గాడ్ చిత్రానికి క్లియరెన్స్ ఇచ్చే విషయంలో కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ, సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు(సిఎఫ్బిసి) మధ్య వివాదం తలెత్తింది. రెండ్రోజుల క్రితమే చైర్పర్సన్ లీలా శ్యామ్సన్ రాజీనామా చేశారు.
శనివారం తాజాగా మరో తొమ్మిది మంది బోర్డు సభ్యులు రాజీనామా చేశారు. అరుంధతి నాగ్, ఐరా భాస్కర్, లోరా ప్రభు, పంకజ్ శర్మ, రాజీవ్ మసండ్,శేఖర్ బాబు కంచర్ల,షాజీ కరుణ్, శుభ్రాగుప్తా,టిజి త్యాగరాజన్ తమ రాజీనామాలను బోర్డుకు సమర్పించారు.
తాము బోర్డు సభ్యులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎఫ్బీసీలో అనేక సంస్కరణలు చేపట్టినట్టు వారు స్పష్టం చేశారు. బోర్డు పని తీరుమెరుగుకు అనేక ప్రతిపాదనలు, విజ్ఞప్తులు చేసినప్పటికీ సమాచార ప్రసార మంత్రిత్వశాఖ ఒక్కదానికీ సానుకూలంగా స్పందించలేదని ఆరోపించారు.
మంత్రిత్వశాఖ మితిమీరిన జోక్యం, అవినీతి కారణంగానే రాజీనామా చేయాల్సి వచ్చిందని వారు తెలిపారు. బోర్డులో సంస్కరణలకు తాము తీసుకున్న నిర్ణయాలకు మంత్రిత్వశాఖ మద్దతు లభించడం లేదని, నిధులు కూడా కేటాయించేవారు కాదని చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసిన లీలా, సభ్యులు ఆరోపించారు.
చలనచిత్ర రంగంతో ఏమాత్రం సంబంధంలేని అధికారులను ప్రభుత్వం బోర్డు అధికారులుగా నియమిస్తోందన్నారు. గత ఏడాదిగా ఒక్క బోర్డు సమావేశానికీ అధికారులు హాజరుకాలేదని తెలిపారు. సీఎఫ్బీసీ స్వయం నిర్ణయాధికారం, ప్రతిపత్తికి భంగం కలిగేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందనే తాము వైదొలుగుతున్నట్టు రాజీనామా లేఖలో వారు వెల్లడించారు. సినిమాలకు సర్టిఫికేట్ల జారీలో ప్రభుత్వం జోక్యం తగదని వారు విమర్శించారు.
మరోవైపు, డేరా సచ్ఛా సౌదా గురువు గుర్మీత్ సింగ్ నటించిన మెసెంజర్ ఆఫ్ గాడ్ చిత్ర ప్రదర్శనను పంజాబ్ ప్రభుత్వం నిషేధించింది. చిత్రంపై రాష్టవ్య్రాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి సలహాదారు హర్చరణ్ బైన్స్ వెల్లడించారు.
గుర్మీత్ సింగ్ నటించిన చిత్రం నిలిపివేయాలంటూ శిరోమణి అకాలీదళ్ అనుబంధ సంస్థలు పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. అయితే, తాము జోక్యం చేసుకోవడం లేదని, అనవసర రాద్ధాంతం చేస్తున్నారని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ఆరోపించారు.