యువతకు సత్య నాదెళ్ల దిశానిర్దేశం: మోడీతో భేటీ
న్యూఢిల్లీ: ప్రపంచానికి నిరంతరం స్ఫూర్తినిచ్చే సామర్థ్యం భారత్కు ఉందని టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈఓ సత్య నాదెళ్ల ప్రశంసించారు. సోమవారం భారత పర్యటనకు వచ్చిన మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈవో సత్య నాదెళ్ల న్యూఢిల్లీలో ఆ కంపెనీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులు, యువపారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. క్లౌడ్ టెక్నాలజీ, మొబైల్ ఆవశ్యకతను గురించి నాదెళ్ల ఈ సమావేశంలో వివరించారు. అంతేగాక యాప్ టెక్నాలజీపై కూడా ఆయన మాట్లాడారు.
ప్రస్తుత కాలంలో యాప్లలో చాలా మార్పులు వచ్చాయని.. మానవ సామర్థ్యాన్ని యాప్లు పెంపొందిస్తున్నాయన్నారు. ప్రతి విషయాన్ని కొత్తగా చూడటం నేర్చుకోవాలన్నారు. 'టెక్ ఫర్ గుడ్, ఐడియాస్ ఫర్ ఇండియా' అంశంపై ఆయన ప్రసంగిస్తూ మొదట గాలీబ్ సూక్తిని ఉటంకించారు.
యువ ఔత్సాహికులకు మీరు ఇచ్చే సలహా ఏమిటని అడుగ్గా.. 'ధైర్యంగా ఉండండి. భవిష్యత్తులో మైక్రోసాఫ్ట్ సీఈవో అవ్వడం లాంటి ఉన్నతమైన కలల సాకారానికి కృషి చేయండి' అంటూ నాదెళ్ల సూచించారు.
'భారత ప్రజల మేధోకుశలతను పెంపొందించే వేదికను అందించేందుకు మేం కృషి చేస్తున్నాం' అని ఆయన పేర్కొన్నారు. కంటిచూపులేని వారికి, తక్కువగా ఉన్నవారికి ఉపయోగపడేవిధంగా తీసుకొచ్చిన అడ్వాన్స్డ్ లెవెల్ స్మార్ట్గ్లాసెస్ వీడియోను ఈ సందర్భంగా ప్రదర్శించారు. దీనిని మైక్రోసాఫ్ట్కు చెందిన హోలోలెన్స్ కంపెనీ రూపొందించింది.
Discussed various issues pertaining to the IT sector with @Microsoft CEO @satyanadella. @MicrosoftIndia pic.twitter.com/QYYYS49XRP
— Narendra Modi (@narendramodi) 30 May 2016
ప్రధానమంత్రి మోదీతో భేటీ
సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవోగా 2014 ఫిబ్రవరిలో బాధ్యతలు చేపట్టిన నాదెళ్ల మూడోసారి భారత పర్యటనకు వచ్చారు. భారత్లో మైక్రోసాఫ్ట్ ప్రారంభమై 25 ఏళ్ల పూర్తవుతున్న సందర్భంగా ఆయన తాజా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. అలాగే భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ప్రతినిధులను కూడా ఆయన కలువనున్నారు.