మద్యం మత్తులో పోలీసులకు ఫోన్, అరెస్టు
పనాజీ: మద్యం మత్తులో పోలీసులకు ఫోన్ చేసి ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన వ్యక్తిని చివరికి పోలీసులు అరెస్టు చేశారు, నేపాల్ కు చెందిన 40 సంవత్సరాల వ్యక్తిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని గోవా ఎస్పీ ఉమేష్ గోంకార్ తెలిపారు.
ఎస్పీ ఉమేష్ గోంకార్ కథనం మేరకు బుధవారం అర్దరాత్రి 12 గంటల సమయంలో పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసిన వ్యక్తి తన పేరు నీమ్ బహుదూర్ అని పరిచయం చేసుకున్నాడు. తరువాత ఏడుగురు ఉగ్రవాదులు ఇక్కడ చోరబడి విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పాడు.
పోలీసులు ఎక్కడా ఎక్కడా అని వివరాలు అడుగుతున్న సమయంలో అతని ఫోన్ కట్ అయ్యింది. పోలీసులు అతని మొబైల్ కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. రాత్రి పూర్తిగా పోలీసులు పలు చోట్ల ఉగ్రవాదుల కోసం గాలించారు.
నానాతంటాలు పడి చివరికి ఉత్తుత్తి బెదిరింపు ఫోన్ అని నిర్దారించుకున్నారు. గురువారం ఉదయం ఫోన్ చెయ్యగా రింగ్ అయ్యింది. సిగ్నల్స్ ఆదారంగా గాలించి దక్షిణ గోవాలోని కార్టలీమ్ గ్రామంలో అతన్ని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని ఎస్పీ ఉమేష్ గోంకార్ అన్నారు. ఫోన్ చేసిన సమయంలో తాను మద్యం సేవించానని అతను అంగీకరించాడని ఎస్పీ ఉమేష్ గోంకార్ తెలిపారు.