దేవయాని కోబ్రాగాడేకు షాక్: పని లేకుండా ఖాళీ చేతులతో
న్యూఢిల్లీ: దౌత్యవేత్త దేవయాని కోబ్రాగాడే చిక్కుల్లో పడ్డారు. ఆమెకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. విదేశాంగ మంత్రిత్వ శాఖలో ఆమెను విధుల నుంచి తప్పించి, తప్పనిసరి నిరీక్షణలో పెట్టారు. అనుమతి తీసుకోకుండా మీడియాతో మాట్లాడినందుకు ఆమెకు ఈ షాక్ తగిలింది.
డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ డివిజన్లో డైరెక్టర్గా ఉన్న ఆమెను విధుల నుంచి విదేశాంగ మంత్రిత్వ శాఖ తప్పించినట్లు సమాచారం. ఆమెను తప్పనిసరి నిరీక్షణలో పెట్టారు. విజిలెన్స్ కేసులో జరుగుతున్న విచారణకు సంబంధించి ఆమెపై పాలనాపరమైన చర్యలు తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి చెప్పారు.
అంటే, ఆమె సర్వీసులో ఉంటారు గానీ పని ఉండదు. ఆమె మరింతగా పాలనాపరమైన చర్యలకు గురి కావాల్సి వస్తోందని అంటున్నారు. ఐఎఫ్ఎస్ అధికారిగా కూడా కోబ్రాగాడే ప్రభుత్వాన్ని అసంతృప్తికి గురి చేసినట్లు చెబుతున్నారు. దౌత్యపరమైన వివాదంలో చిక్కుకున్న ఆమె తన ఇద్దరు పిల్లలకు అమెరికా పాస్పోర్టులున్నాయనే విషయాన్ని దాచిపెట్టినట్లు ఆరోపణలున్నాయి.
తన భర్త అమెరికా పౌరుడనే విషయాన్ని కూడా ఆమె తెలియజేయనట్లు చెబుతున్నారు. తన పనిమనిషికి సంబంధించిన వీసా దరఖాస్తులో తప్పుడు వివరాలు ఇచ్చారనే ఆరోపణపై 1999 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి అయిన దేవయాని కోబ్రాగాడే గతంలో అరెస్టు కూడా అయ్యారు. 250,000 డాలర్ల బాండ్పై ఆమె విడుదలయ్యారు. ఆ గొడవ తర్వాత ఆమె భారత్కు బదిలీ అయ్యారు.