మిఖాయల్ కొడుకుకాదు! ఇంద్రాణీ ట్విస్ట్, షీనా హత్యపై
ముంబై: కూతురు షీనా బోరా హత్య కేసులో ఆమె తల్లి ఇంద్రాణి రోజుకో కట్టుకథ వినిపిస్తున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా ఇంద్రాణి మరో షాకింగ్ ఇచ్చింది. తన కుమారుడిగా లోకానికి పరిచయమైన మిఖాయిల్.. అసలు తన కొడుకే కాదని, అతన్ని దత్తత తీసుకున్నానని వెల్లడించినట్టు తెలుస్తోంది.
తనను కలిసిన న్యాయవాదికి ఇంద్రాణి ఈ విషయాన్ని వెల్లడించినట్టుగా ఆంగ్ల మీడియాలో వస్తోంది. తాను ఇంద్రాణి కుమారుడినని ఇప్పటికే చాలా సందర్భాల్లో మిఖాయిల్ వెల్లడించాడు. ఇంద్రాణి టీనేజ్ వయసులో ఉండగా సహజీవనం చేసిన సిద్ధార్థ దాస్, షీనా, మిఖాయిల్లు తనకు, ఇంద్రాణికి పుట్టినట్టు వెల్లడించారు.
ఎవరు ఎవరికి పుట్టారన్న విషయాన్ని డీఎన్ఏ రిపోర్టు తేల్చేస్తుందని పోలీసులు చెబుతున్నారు. అయితే, ఇంద్రాణి రోజుకో కథ చెబుతోన్న విషయం తెలిసిందే. ఇంద్రాణి చెప్పినట్లు మిఖాయిల్ దత్తత తీసుకున్న తనయుడే అయితో కేసులో ఇది మరో ట్విస్ట్ అని చెప్పవచ్చు.
ఓ థ్రిల్లర్లా సాగుతున్న షీనా బోరా హత్య కేసులో బుధవారం మరికొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇంద్రాణి, ఆమె ప్రస్తుత భర్త పీటర్ ముఖర్జియాలను బుధవారం ఎదురుబొదురు కూచోబెట్టి పోలీసులు వారిద్దరినీ ప్రశ్నించారు.
మరోవైపు ముంబై పోలీసులు అధికారులు ముగ్గురు కోల్కతా వెళ్లి షీనా బోరా తండ్రిగా, ఇంద్రాణి ఒకనాటి సహజీవన భాగస్వామిగా చెబుతున్న సిద్ధార్థ్ దాస్ను ప్రశ్నించారు.
ముంబై పోలీసులు బుధవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో కోల్కతా చేరకుని నేరుగా ఇక్కడి దుర్గానగర్లోని దాస్ ఇంటికి వెళ్లారు. సిద్ధార్థ్ దాస్ను కూడా ఇంద్రాణి సమక్షంలోనే ముంబై పోలీసులు ప్రశ్నించే అవకాశం లేకపోలేదని కోల్కతా పోలీసు అధికారి పేర్కొన్నారు. కాగా, షీనా హత్య విషయమై పూర్తి వివరాలను ఇంద్రాణి పోలీసులకు వెల్లడించినట్లుగా తెలుస్తోంది.