బాలిక కిడ్నాప్: కదులుతున్న కారులో గ్యాంగ్రేప్
మీరట్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, రాష్ట్రంలోని మీరట్లో ఓ 14 ఏళ్ల బాలికపై నలుగురు యువకులు కదులుతున్న కారులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఖాట్కోలి ప్రాంతానికి చెందిన 9వ తరగతి చదువుతున్న బాలిక తన సోదరితో కలిసి బుధవారం ఉదయం పాఠశాలకు వెళ్తుండగా కారులో వచ్చిన నదీమ్ అనే యువకుడు స్కూల్లో దింపుతామని వారిని కారు ఎక్కించుకున్నాడు.
నదీమ్ వారికి తెలిసిన వ్యక్తి కావడంతో నిర్భయంగా వారు కారెక్కారు. అయితే స్కూలు దగ్గర బాధితురాలి సోదరిని దించేసిన నదీమ్, ఆమె అక్కను మాత్రం కారులో ఉన్న మిగతా ముగ్గురి యువకుల సహాయంతో బలవంతంగా తీసుకెళ్లాడు.
ఆ తర్వాత కారును మీరట్లోని రోడ్లపై తిప్పుతూ బాలికపై నలుగురూ కలిసి అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం కర్దౌనీ ప్రాంతంలోని మసూరీ రోడ్లో ఆమెను పడేసి పరారయ్యారు. అప్పటికే ఆమె స్పృహ కోల్పోయింది.
గమనించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుల కోసం తీవ్రంగా గాలింపు చేపట్టారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన వారిలో ఒకడైన నదీమ్ను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. మిగతా ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.