పదేళ్ల బాలికపై దారుణం: అత్యాచారం చేసి నైలాన్ తాడుతో..
గుర్ గ్రామ్ పరిధిలోని ఓ అపార్ట్మెంట్ బయట ఆడుకుంటున్న కొంతమంది చిన్నారులు బాలిక మృతదేహాన్ని గుర్తించారు.
గుర్ గ్రామ్: అదృశ్యమైన ఓ బాలిక శవమై తేలడం గుర్ గ్రామ్ లో కలకలం రేపింది. వారం రోజుల క్రితం తప్పిపోయిన ఆ బాలిక.. సెక్టార్ 53లోని ఒక ఖాళీ ప్లాటులో శవపై కనిపించింది. బాలిక మెడ చుట్టూ నైలాన్ తాడు బిగించి ఉండటంతో పాటు నోటికి ప్లాస్టర్ అంటించి ఉంది.
శరీరంపై కూడా పలుచోట్ల గాయాల గుర్తులున్నాయి. దీంతో బాలికపై అత్యాచారం జరిపి, హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోస్టు మార్టం నివేదిక వచ్చాక గానీ దీనిపై పూర్తి వివరాలు ఇప్పుడే వెల్లడించడం కష్టమంటున్నారు. ఘటనపై ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
కాగా, హత్యకు గురైన బాలిక కుటుంబం వజీరాబాద్ గ్రామంలోని మురికివాడలో నివాసముంటోంది. వీధిలో ఆడుకుంటున్న సమయంలో గత జనవరి 16న బాలిక అదృశ్యమైపోయింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పశ్చిమ బెంగాల్ నుంచి వలస వచ్చిన వీరు చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
గుర్ గ్రామ్ పరిధిలోని ఓ అపార్ట్మెంట్ బయట ఆడుకుంటున్న కొంతమంది చిన్నారులు బాలిక మృతదేహాన్ని గుర్తించారు. బాల్ వెళ్లి మృతదేహం ఉన్న గదిలో పడటంతో.. విగతజీవిగా ఉన్న బాలికను చూసి చిన్నారులు షాకయ్యారు. వెంటనే తమ పెద్దలకు సమాచారం అందించడంతో.. విషయం వెలుగుచూసింది.