డాక్టర్ గుప్తా దంపతుల కిడ్నాప్: లక్నో దుండగుల అరెస్టు
లక్నో: పెళ్లికి వెళ్లి వస్తు భార్యతో కలిసి అదృశ్యం అయిన డాక్టర్ దంపతులను బీహార్, ఉత్తరప్రదేశ్ టాస్కో ఫోర్స్ పోలీసు అధికారులు కలిసి క్షేమంగా రక్షించారు. బడా పారిశ్రామికవేత్తల కుటుంబాలకు చెందిన ఈ దంపతులను కిడ్నాప్ చేసిన 9 మంది నిందితులను అరెస్టు చేశామని లక్నో సీనియర్ పోలీసు అధికారి అమిత్ పాథక్ తెలిపారు.
డాక్టర్ పంకజ్ గుప్తా, ఆయన భార్య శుభ్ర గుప్తాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించామని వివరించారు. మే 1వ తేదిన అడికారులో గయాకు వెళుతున్న గుప్తా దంపతులను దుండగులు వెంబడించారు. తరువాత వీఐపి రెడ్ లైట్ లు ఉన్న రెండు ఖరీదైన ఎస్ యూవీ వాహనాలలో వారి కారును అడ్డగించారు.
దుండగులు పోలీసు దుస్తులలో ఉండటంతో గుప్తా దంపతులు అయోమయంలో పడ్డారు. వెంటనే ఇద్దరిని వారి వాహనాలలో ఎక్కించుకున్న దుండగులు అక్కడి నుండి వెళ్లి పోయారు. ఎవ్వరికి అనుమానం రాకుండా వాహనాలలో గుప్తా దంపతులను మార్చుకుంటు లక్నో చేరుకున్నారు.
లక్నోలోని గోమతి నగర్ ఏరియాలోని శారాద అపార్ట్ మెంట్ లోని ఒక ప్లాట్ లో గుప్తా దంపతులను దాచి పెట్టారు. గుప్తా దంపతులు కష్టపడి బుధవారం వారి కుటుంబ సభ్యులు, బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న బీహార్, ఉత్తరప్రదేశ్ టాస్కో ఫోర్స్ పోలీసులు దుండగులను అరెస్టు చేశారు.
దండగులు కిడ్నాప్ చెయ్యడానికి నాలుగు ఖరీదైన కార్లు ఉపయోగించారని సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయని పోలీసు అధికారి అమిత్ పాథక్ అన్నారు. దుండుగులు ఉన్న ప్లాట్ లో నాటు తుపాకి, సజీవంగా ఉన్న బుల్లెట్ లు స్వాధీనం చేసుకున్నామని అమిత్ పాథక్ వివరించారు. నిందితుల నుండి అడి కారు, కిడ్నాప్ చెయ్యడానికి ఉపయోగించిన రెండు ఖరీదైన కార్లు రికవరి చేశారు.