గుడిసెలు మంటల్లో కాలిపోతుంటే సెల్ఫీలు తీసుకున్న ఎమ్మెల్యే!
భారీ అగ్నిప్రమాదం సంభవించి పేదల గుడిసెలు కాలిపోతుంటే అటుగా వెళుతున్న ఓ ఎమ్మెల్యే.. ఆ మంటలతో సెల్ఫీలు దిగాడు. రాజస్థాన్ లోని బయానా ప్రాంతానికి చెందిన బచ్చుసింగ్ అనే ఎమ్మెల్యే చేసిన
జైపూర్: భారీ అగ్నిప్రమాదం సంభవించి పేదల గుడిసెలు కాలిపోతుంటే అటుగా వెళుతున్న ఓ ఎమ్మెల్యే.. ఆ మంటలతో సెల్ఫీలు దిగాడు. రాజస్థాన్ లోని బయానా ప్రాంతానికి చెందిన బచ్చుసింగ్ అనే ఎమ్మెల్యే చేసిన ఈ పనిపై సర్వాత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వివరాల్లోకి వెళితే.. మంగళవారం బయానా గ్రామంలోని అగ్నిప్రమాదం సంభవించి గుడిసెలు కాలిపోతున్నాయి. అదే సమయంలో ఎమ్మెల్యే బచ్చుసింగ్ కారులో వెళుతున్నారు. మంటలు వ్యాపిస్తున్నా అక్కడ ఎవరూ సహాయక చర్యలు చేపట్టకపోవడంతో కారు దిగి పరిస్థితి గమనించాడు. వెంటనే అగ్నిమాపక అధికారులకు ఆయనే స్వయంగా ఫోన్ చేశారు.
అయితే, ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత ఆయన చేసిన పనే విమర్శలకు దారితీసింది. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకునేలోగా సహాయచర్యలు చేపట్టకుండా దగ్ధమవుతున్ప గుడిసెల దగ్గరకు వెళ్లి సెల్ఫీ తీసుకుని ఆ చిత్రాలను సోషల్మీడియాలో పోస్ట చేశారు.
ఆ ఎమ్మెల్యే నిర్వాకాన్ని చూసిన నెటిజన్లు ఆయనపై విమర్శలతో విరుచుకుపడ్డారు. ఓ ప్రజాప్రతినిధి ఉండి మీరు చేసే పని ఇదా అంటే దుమ్మెత్తిపోస్తున్నారు. అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసిన వ్యక్తి.. వారొచ్చేవరకు సహాయచర్యలు చేపట్టకుండా సెల్ఫీలు తీసుకోవడమేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నెటిజన్ల విమర్శలు నేపథ్యంలో ఆ ఎమ్మెల్యే తాను తీసుకున్న సెల్ఫీ లపై వివరణ ఇచ్చారు. 'అది అసలు సెల్ఫీ కాదు. మంటల్లో కాలిపోతున్న గుడిసెలను ఫొటో తీసి సోషల్మీడియాలో పెట్టాను. కనీసం అది చూసైనా అధికారులు వెంటనే స్పందిస్తారు కదా. నేను ఫొటోలు తీయకపోయి ఉంటే అధికారులు సమయానికి వచ్చుండేవారు కాదు' అంటూ ఎమ్మెల్యే బచ్చు సింగ్ తన పనిని సమర్థించుకున్నారు. అంతేగాక, ఇలాంటి ప్రమాద ఘటన సందర్భంలో తాను సెల్ఫీ ఎందుకు తీసుకుంటానని ప్రశ్నించారు ఆ బీజేపీ ఎమ్మెల్యే.