మోడల్పై రేప్: సస్పెండ్ అయిన డీజీపీ అరెస్టుకు రంగం సిద్దం?
ముంబై: అత్యాచారం కేసులో సస్పెండ్ అయిన మహారాష్ట్ర డీజీపీని ఎప్పుడైనా అరెస్టు చేసే అవకాశం ఉంది. గురువారం సాయంత్రం లోపు సస్పెండ్ అయిన డీజీపీ సునీల్ పరస్కర్ విచారణకు హాజరు కాకుంటే అరెస్టు చేస్తామని ముంబై జాయింట్ పోలీసు కమిషనర్ అతుల్ చంద్ర కులకర్ణి అంటున్నారు.
2013 డిసెంబర్ 7వ తేదిన ముంబైకి చెందిన 26 సంవత్సరాల మోడల్ తన మీద డీఐజీ సునీల్ పరస్కర్ (57) అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులకు అప్పగించారు.
అత్యాచారం ఆరోపణలు రావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం సునీల్ పరస్కర్ ను సస్పెండ్ చేసింది. తన మీద నవి ముంబాయిలోని ఒక అపార్ట్ మెంట్ లోని ఫ్లాట్ లో పోలీసు అధికారి సునీల్ పరస్కర్ అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులకు చెప్పింది.
అపార్ట్ మెంట్ లోని సీసీ కెమెరాలలో ఆ దృశ్యాలు రికార్డు అయ్యాయని పుటేజిలను పోలీసులకు అందించింది. ముంబైలోని ప్రత్యేక మహిళ కోర్టులో కేసు విచారణ జరుగుతున్నది. గత సోమవారం విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం సునీల్ పరస్కర్ కు నోటీసులు జారి చేసింది. సునీల్ పరస్కర్ ముందస్తు జామీనుకు కోర్టులో అర్జీ సమర్పించాడు. బాధితురాలి తరఫున న్యాయవాది చిత్ర సలుంకే వాదిస్తున్నారు.