ఎవరైతే నాకేంటి!: హజారేకు మోడీపై కోపమొచ్చింది: కేజ్రీ, బేడీల పైనా
న్యూఢిల్లీ/ముంబై: ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే నరేంద్ర మోడీ ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తున్నారు. అవినీతి పైన మోడీ మాట తప్పారని, నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తానన్న బీజేపీ విఫలమైందని హజారే మండిపడుతున్నారు.
మూడేళ్ల క్రితం అన్నాహజారే లోక్పాల్ కోసం, నల్లధనం కోసం ఉద్యమం చేసినప్పుడు.. నాడు కాంగ్రెస్ పార్టీ ఆయన పైన తీవ్ర ఆరోపణలు చేసింది. హజారే వెనుక భారతీయ జనతా పార్టీ ఉందని ఆరోపించింది. ఆ వ్యాఖ్యలను ఇటు హజారే, అటు బీజేపీ కొట్టి పారేసింది. అయితే, ఇప్పుడు అదే హజారే మోడీ ప్రభుత్వం పైన విమర్శలు గుప్పిస్తున్నారు.
విదేశాల్లో పేరుకుపోయిన నల్ల్ధనాన్ని వెనక్కి రప్పిస్తామన్న ఎన్నికల హామీని బీజేపీ నెరవేర్చడంలో విఫలమైందని, అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో విదేశాల్లోని నల్లడబ్బును తెస్తామని చెప్పారని, ఇప్పుడు అదేమైందని ప్రశ్నించారు.
నల్లధనం వెనక్కి రప్పిస్తే ఒక్కో భారతీయుడి ఖాతాలో లక్షలు జమ చేయవచ్చునని ప్రగల్భాలు పలికిన బీజేపీ అధికారంలోకి వచ్చి ఇన్నాళ్లయినా ఒక్క రూపాయి ప్రజల ఖాతాల్లో వేయలేకపోయిందన్నారు. నల్లధనం, లోక్పాల్ చట్టం, భూసేకరణ తదితర అంశాలపై తాను ఉద్యమం ప్రారంభిస్తానని చెప్పారు.
అవినీతిపై పోరాటంలో ప్రధాని మోడీ మాట తప్పారని ఆరోపించారు. అవినీతిని అంతమొందించే అంశంలో ఎన్డీయే ఇచ్చిన హామీలు అమలు కావడం లేదన్నారు. అవినీతిరహిత సమాజం కోసం తన ఉద్యమం కొనసాగుతుందని, త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
లోక్పాల్ల్, లోకాయుక్త బిల్లులు వచ్చాయని, ఏడాదిలో అన్ని రాష్ట్రాల్లోను లోకాయుక్త నియామకం జరగాలని ఆ చట్టం చెబుతోందన్నారు. అయితే జనవరి ఒకటవ తేదీతోనే ఏడాది పూర్తయినా ఇంకా అనుకున్న పని మాత్రం పూర్తి కాలేదన్నారు.
దేశ సంక్షేమాన్ని కాంక్షించే భావసారూప్య వ్యక్తులను కలుపుకుని ఉద్యమిస్తామని చెప్పారు. ప్రభుత్వం దేశాన్ని బలహీనపరిచినప్పుడు ప్రజలు ఉద్యమించక తప్పదన్నారు. అనుకున్న కర్తవ్యం నెరవేరే వరకు ఉద్యమం ఆగదని, ఎవరు తోడుగా వచ్చినా రాకున్నా ఉద్యమాన్ని కొనసాగిస్తానన్నారు.
అదే సమయంలో ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ, ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ పైన కూడా అన్నాహజారే అసంతృప్తితో, ఆగ్రహంతో ఉన్నారు. తన ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వారు.. రాజకీయ ఎదుగుదలకు దానిని ఉపయోగించుకున్నారని ఆయన ఆవేదన చెందుతున్నారని చెబుతున్నారు.
అరవింద్ కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చాక తనను ఒక్కసారి కూడా కలవలేదని గురువారం అన్నాహజారే వ్యాఖ్యానించారు. అయితే, ఆయన పేరును మాత్రం వారు ఉపయోగించుకుంటున్నారని హజారే అభిమానులు మండిపడుతున్నారు. ఇక కిరణ్ బేడీ బీజేపీలో చేరేముందు హజారేకు కనీసం చెప్పలేదని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అందుకే, ఆమె పలుమార్లు ఫోన్ చేసినా ఆయన మాట్లాడలేదు.
మోడీ, కేజ్రీ, బేడీలపై హజారే ఆగ్రహం వెనుక...!
మోడీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏం చేయలేదని, మాట్లాడటం మినహా చేసిందేమీ లేదని, మన్మోహన్ సింగ్కు, ప్రధాని మోడీకి తేడా లేదని అన్నాహజారే అభిప్రాయపడుతున్నారు.
విదేశాల్లోని నల్లధనం వెనక్కి తెస్తే ప్రతి భారతీయుడి ఖాతాలో రూ.15 లక్షలు వేయవచ్చునని చెప్పిన బీజేపీ ఇప్పుడు కనీసం రూ.15 కూడా తీసుకు రాలేదని అంటున్నారు.
ప్రస్తుతం రాజకీయాల్లో అవినీతి వెనక్కి వెళ్లిపోయింది. మోడీ, కేజ్రీ, బేడీ.. ఎవరికైనా పదవి ముఖ్యమైపోయిందని, వారు సమాజానికి తాము చేయాల్సిన విషయాన్ని పక్కన పెట్టేస్తున్నారని హజారే అభిప్రాయం.
అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాల్లోకి అడుగు పెట్టాక అధికారం పైన ఎక్కువగా ఆశ పడుతున్నారని అన్నా వర్గీయులు భావిస్తున్నారు.
కిరణ్ బేడీ తనకు ఫోన్ చేసిన విషయం తనకు తెలియదని, ఆమె తనను కలవవచ్చునని అన్నాహజారే చెబుతున్నారు. అయితే, ఆమె బీజేపీలో చేరడాన్ని మాత్రం ఆయన జీర్ణించుకోలేకపోతున్నారట.
ప్రస్తుతం ఉన్న లోక్పాల్ సరిపోతుందని కిరణ్ బేడీ చెబుతున్నారు. అదే నిజమైతే ఢిల్లీలో అవినీతి పోవాలి కదా అని ప్రశ్నిస్తున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు అవుతారనే విషయం తనకు ప్రాధాన్యతాంశం కాదని అన్నాహజారే చెబుతున్నారు. అయితే, అవినీతి వ్యతిరేకులు అయి ఉండాలని కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి ఎవరు అయినా అవినీతి లేకుండా చేసేవారు కావాలన్నారు.