ఈ వారధి ప్రత్యేకం: 9.15కి.మీల మెగా వంతెనని జాతికి అంకితమిచ్చిన మోడీ
దేశంలోనే అత్యంత పొడవైన వంతె ధోలా-సాదియాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. యూపీఏ ప్రభుత్వం పదేళ్లున్నా పూర్తవని ఈ ప్రాజెక్టు..
తీన్సుకియా: దేశంలోనే అత్యంత పొడవైన వంతె ధోలా-సాదియాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. యూపీఏ ప్రభుత్వం పదేళ్లున్నా పూర్తవని ఈ ప్రాజెక్టు.. తాము వచ్చిన మూడేళ్లలోనే పూర్తి చేశామని చెప్పారు. ఈ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో ఈ ప్రాంత రైతుల ఆదాయం కూడా పెరుగుతుందని చెప్పారు.
చైనాకు అత్యంత సమీపంలోనే..
అసోంలోని తీన్సుకియా జిల్లాలో చైనా సరిహద్దుకు అత్యంత సమీపంలో బ్రహ్మపుత్ర ఉపనది లోహిత్పై ధోలా-సాదియా వంతెన నిర్మించారు. ఇది అసోం రాజధాని దిస్పూర్కు 540కి.మీ.లు.. అరుణాచల్ప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఈటానగర్కు 375 కి.మీ.ల దూరంలో ఉంది.
ఐదు గంటల ప్రయాణం ఆదా
9.15 కిలోమీటర్ల పొడవున్న ఈ వంతెన కారణంగా అసోం, అరుణాచల్ప్రదేశ్ల మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. గతంలో ఈ రెండింటి మధ్య ప్రయాణం ఆరు గంటల సమయం తీసుకునేది. తాజా వంతెనతో అది గంటకు తగ్గనుంది. మొత్తంగా ఈ వంతెన కారణంగా ఐదుగంటల ప్రయాణ సమయం ఆదా కానుంది.
రక్షణకు కూడా వారధే
రూ. 2,056కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ వంతెనతో భారత్-చైనా సరిహద్దులోని సైనిక శిబిరాలకు రక్షణ సామాగ్రిని చేరవేయడానికి ఈ వంతెన అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నారు. భారీ ఆయుధాలను తీసుకెళ్లినా ఈ వంతెనకు ప్రమాదమేమీ ఉండదు.
భద్రతను పక్కన పెట్టి..
వంతెన ప్రారంభించిన అనంతరం ప్రధాని కారులో ప్రయాణించారు. కాస్త దూరం వెళ్లాక కారు నుంచి దిగి భద్రతను పక్కన పెట్టి కొంతదూరం ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లి వంతెనను పరిశీలించారు. ఆ తర్వాత అక్కడి అధికారులతో వంతెన నిర్మాణం గురించి అడిగి తెలుసుకున్నారు.
వంతెన ప్రారంభోత్సవ ప్రత్యేకత
కేంద్రంలో మోడీ పాలన విజయవంతంగా మూడేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ వంతెనను శుక్రవారం ప్రారంభించడం గమనార్హం. అంతేగాక, నేడు మరో ప్రత్యేకత కూడా ఉంది. అసోంలో బీజేపీ అధికారం చేపట్టి నేటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. గత సంవత్సరం అసోంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో మే 26, 2016న బీజేపీ నేత శర్వానంద సోనోవల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.