షెహన్షాలా ఫీలవుతున్నారు: మోడీపై సోనియా ఫైర్
రాయ్బరేలి: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా సంబరాలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. దీనిపై సోనియా మంగళవారం ఘాటుగా స్పందించారు.
నరేంద్ర మోడీ షెహన్ షా(చక్రవర్తి)లా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. ఆయన ఒక దేశానికి ప్రధానమంత్రి అంతేకానీ చక్రవర్తి కాదని, దేశం ఎంతో పేదరికంలో ఉందని, పలు ప్రాంతాల్లో కరవు వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సోనియా చెప్పారు.
కానీ, ప్రభుత్వం ఇవేమీ పట్టనట్లు సంబరాలు చేసుకుంటోందని, మోడీ ప్రభుత్వంలోని మంత్రులందరూ సంబరాల్లోనే బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రియాంక గాంధీ వాద్రా భర్త రాబర్ట్ వాద్రాపై అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్నారంటూ ఆరోపణలు చేస్తున్న బిజెపి నేతలపైనా ఆమె మండిపడ్డారు. ఆరోపణలపై విచారణ జరిపి రుజువు చేయాలని సవాల్ విసిరారు.
బ్రిటిష్ పౌరసత్వం కోసం వాద్రా యత్నాలు: స్వామి ఆరోపణ
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపై బిజెపి ఎంపీ సుబ్రమణ్య స్వామి సంచలన ఆరోపణ చేశారు. ఫాస్ట్ ట్రాక్ బ్రిటిష్ పౌరసత్వం కోసం రాబర్ట్ వాద్రా భారీగా సొమ్ము చెల్లించినట్టు ఆయన ఆరోపించారు.
వాద్రా బ్రిటిష్ పౌరసత్వం పొందడానికి ముందే ఆయనపై ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. లండన్లో రాబర్ట్ వాద్రాకు ఆస్తులున్నాయన్న విషయంలో ఎలాంటి అనుమానం లేదని అన్నారు.
ఆయుధ డీలర్ సంజయ్ భండారిపై ఆదాయం పన్ను అధికారుల దాడుల్లో... బండారీ సహచరులకు వాద్రాతో సంబంధాలున్నాయని, లండన్లో ఆస్తి విషయమై వారి మధ్య సంభాషణలు జరిగాయని, పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూసిన నేపథ్యంలో స్వామి తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించున్నాయి.