మోడీ సూటు డబ్బుతో గంగా శుద్ధి అవుతుందా?: రాజ్ థాకరే ప్రశ్న
ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ థాకరే శనివారం నాడు ప్రధాని నరేంద్ర మోడీ పైన విమర్శలు గుప్పించారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన సందర్భంగా తన పేరు ఉన్న సూటు పైన విమర్శలు రావడం, వివాదాస్పదం కావడంతోనే దానిని వేలం వేశారని వ్యాఖ్యానించారు.
అంత విలువ కలిగిన సూటును మోడీ వేసుకోవడంపై విమర్శలు వచ్చాయని, అందుకే దానిని వేలం వేశారన్నారు. ఆయన పార్టీకి చెందిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు.
ప్రధాని మోడీ సూటును వేలం వేస్తే గంగా నది శుద్ధి అవుతుందా అని ప్రశ్నించారు. టోల్ పేలో పారదర్శకత వచ్చే వరకు ప్రజలు దానిని చెల్లించవద్దని సూచించారు. ఇప్పుడు ఏ ఇతర మహారాష్ట్ర పార్టీ కూడా రోడ్డు టోల్ విషయమై మాట్లాడటం లేదని ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం టోల్ ఫ్రీని రద్దు చేస్తామని అధికారంలోకి వచ్చిందని రాజ్ థాకరే అన్నారు. ఇప్పుడు ఆ పార్టీ దీని గురించి మాట్లాడటం లేదన్నారు. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ సూటు వేలం వేయడం ద్వారా వచ్చిన మొత్తాన్ని గంగాశుద్ధికి ఉపయోగిస్తామని చెప్పిన విషయం తెలిసిందే.