రెండోసారి అప్పీల్ దాఖలు చేసిన ప్రధాని మోడీ భార్య జశోదా బెన్
అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ భార్య జశోదా బెన్ తనకు కల్పించిన భద్రత పైన సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసినా సమాచారం ఇవ్వకపోవడంతో... గుజరాత్ రాష్ట్ర సమాచార కమిషనర్కు రెండోసారి అప్పీలు దాఖలు చేశారు.
తనకు కల్పించిన భద్రత, తనకున్న హక్కులపై సమాచారాన్ని కోరుతూ గత ఏడాది నవంబర్ నెలలో మెహ్సానా పోలీసు స్టేషన్కు ఆమె సమాచార హక్కు దరఖాస్తు సమర్పించారు. భద్రత కల్పిస్తూ వెలువడిన అసలైన ఉత్తర్వుల పత్రాలను ధ్రువీకరించి తనకు ఇవ్వాల్సిందిగా కోరారు.
అది నిఘా విభాగానికి చెందిన సమాచారమనీ, దానికి సమాచార హక్కు చట్టంలో మినహాయింపు ఉందనీ చెబుతూ సమాచార అధికారి ఈ దరఖాస్తును తిరస్కరించారు. దీంతో ఆమె మరోసారి అప్పీల్ చేశారు.
కాగా, తనకు కల్పించిన భద్రతపై ప్రధాని నరేంద్ర మోడీ సతీమణి జశోదా బెన్ నాడు అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు కల్పించిన భద్రతపై ఆర్టీఐ సమాచారం అడిగారు. కలిసి ఉందామని మోడీ నుంచి పిలుపు వస్తే తాను ఢిల్లీ వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆమె అప్పుడు తెలిపారు.
మోడీకి, జశోదా బెన్కు చిన్న వయస్సులోనే వివాహం జరిగినప్పటికీ వారిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. అయితే, మోడీ ప్రధాని అయిన తర్వాత నిబంధనల ప్రకారం జశోదాకు భద్రత కల్పించారు. అయితే, ఆ భద్రత ఏర్పాట్లపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి భార్యగా నిబంధనల ప్రకారం తనకు ఏ స్థాయి భద్రత కల్పించాలి, ప్రస్తుతం ఎంతమేరకు భద్రత కల్పించారని అడుగుతూ నవంబర్ నెలలో ఆమె సమాచార హక్కు చట్టం కింద గుజరాత్లోని మెహసానా జిల్లా పోలీసులకు దరఖాస్తు దాఖలు చేశారు.
తన భద్రతకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన యాక్చువల్ ఆర్డర్ ధ్రువీకృత కాపీ సహా పలు పత్రాలను తనకు ఇవ్వాల్సిందిగా అందులో కోరారు. తన గార్డులు కార్ల వంటి ప్రభుత్వ వాహనాలను వినియోగిస్తుండగా, ప్రధాని భార్యనై ఉండీ తాను బస్సుల వంటి ప్రజా రవాణా వ్యవస్థల్లో ప్రయాణిస్తున్నానని ఆమె ఆవేదన వెలిబుచ్చారు.