రేప్: పోలీస్ కావాలనుకున్న టీనేజ్ గర్ల్, సీసీటీవీలో షాకింగ్ అంశాలు
చండీగఢ్: పంజాబ్లోని మోగా జిల్లాలో జరిగిన లైంగిక దాడి అనంతరం మృతి చెందిన బాధితురాలు.. తాను పోలీసు శాఖలో పని చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని స్నేహితులు చెబుతున్నారు. మూడు రోజుల క్రితం మోగా జిల్లాలో పదమూడేళ్ల బాలిక పైన లైంగిక దాడికి పాల్పడి బస్సులో నుండి తోసేసిన సంఘటన తెలిసిందే.
బాధిత టీనేజ్ బాలిక పోలీసు శాఖలో పని చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని స్నేహితులు, కుటుంబ సభ్యులు చెప్పారు. బలహీన వర్గాలు, పీడిత వర్గాల కోసం ఓ పోలీసు ఆఫీసర్గా పని చేయాలని కోరుకుందని చెబుతున్నారు.ఆమె సోదరుడు సందీప్ సింగ్, చిన్న నాటి స్నేహితురాలు సోమా రాణి తదితరులు మాట్లాడుతూ పై విషయం చెప్పారు.
మరోవైపు, ఈ బస్సులోంచి తోయడం వల్ల బాలిక ప్రాణాలు పోయిన ఘటన గురించి పోలీసులు షాకింగ్ విషయాలు చెప్పారు. బస్సు ప్రయాణించిన రూట్లోని సీసీటీవీ కెమెరాల వీడియోను విడుదల చేశారు.
ఆ వీడియో ప్రకారం ఆ రోజు బస్సును వారు అడ్డగోలుగా నడిపారు. పూర్తిగా నియమనిబంధనలను తుంగలో తొక్కారు. నాలుగు లేన్ల రోడ్డులో వాహనాలకు ఎదురుగా నడపటంతో పాటు రెప్పపాటులో ట్రాక్టర్ను ఢీకొట్టే ప్రమాదం నుండి తప్పించుకున్నారు. లైంగిక దాడి ఘటనలో బస్సులో నుండి తోయబడ్డ కూతురు మరణించిన విషయం తెలిసిందే. తల్లికి తీవ్ర గాయాలయ్యాయి.