జైల్లో శశికళ.. ఏవరు.. ఎక్కడ: మన్నార్గుడి వ్యూహాలకు 'ఐటీ'తో ఢిల్లీ చెక్?
అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు మరిన్ని కష్టాలు ఉన్నాయని అంటున్నారు. జయలలిత మృతి అనంతరం సీఎం కావాలనుకున్న శశికళ ఇప్పుడు జైలు జీవితం గడుపుతున్నారు. జైల్లో ఉన్నా చక్రం తిప్పాలనుకున్నారు.
చెన్నై: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు మరిన్ని కష్టాలు ఉన్నాయని అంటున్నారు. జయలలిత మృతి అనంతరం సీఎం కావాలనుకున్న శశికళ ఇప్పుడు జైలు జీవితం గడుపుతున్నారు. జైల్లో ఉన్నా చక్రం తిప్పాలనుకున్నారు. కానీ అది కూడా రివర్స్ అయింది.
తన స్థానంలో.. దినకరన్కు డిప్యూటీ పదవిని కట్టబెట్టి పార్టీ పగ్గాలు అప్పగించింది. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన దినకరన్ రెండాకుల గుర్తు కోసం కోట్లాది రూపాయల లంచం కేసులో ఇరుక్కున్నారు. శశికళకు వరుసగా షాక్లు తగులుతున్నాయి.
శశికళకు షాక్ వరకు..: తమిళనాడులో మిడ్నైట్ డ్రామా
జయలలిత మృతి అనంతరం పార్టీని శశికళ గుప్పెట్లో పెట్టుకున్నారు. సీఎంగా పగ్గాలు చేపట్టాలనుకుంటే.. అక్రమాస్తుల కేసు ద్వారా సుప్రీం కోర్టు ఆమె ఆశలపై నీళ్లు చల్లింది. శశికళకు జైలు నుంచి దినకరన్ అరెస్ట్ వరకు ఢిల్లీ పెద్దల హస్తం ఉందనే ప్రచారం సాగుతోంది.
శశికళ జైల్లో ఉన్నా.. మన్నార్గుడి వ్యూహాలు
రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం దీనిని ఖండిస్తున్నారు. ఇదిలా ఉండగా, శశికళ, దినకరన్లు కేసుల రూపంలో దూరమైనా.. మన్నార్గుడి మాఫియా చాపకింద నీరులా వ్యూహాలకు పదునుపెట్టే అవకాశాలు ఉన్నట్లుగా ఢిల్లీ పెద్దలకు సమాచారం వెళ్లిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఆ ఆస్తులపై పెద్దల గురి
శశికళ కుటంబ మాఫియాను అణిచివేసేందుకు ఢిల్లీ పెద్దలు అస్త్రాలు సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జయలలిత అధికారాన్ని అడ్డం పెట్టుకొని చాపకింద నీరులా ఆ మాఫియా కూడబెట్టిన ఆస్తులను గురిపెట్టి దాడులకు పథకం సాగుతున్నారనే ప్రచారం సాగుతోంది.
అన్నీ రాష్ట్రాల్లోని ఆస్తులనూ టార్గెట్ చేశారు
శశికళ కుటుంబానికి చెందిన వారి గుప్పెట్లో అనేక సంస్థలు, సినిమా థియేటర్లు, మాల్స్ ఉన్నట్లుగా గతంలో ఆరోపణలు వచ్చాయి. ఏపీ, తెలంగాణ, కర్నాటకలోని ఆస్తుల పైన కూడా గురి పెట్టినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఛానళ్లు సహా ఎవరి పర్యవేక్షణలో..
ఈ ఆస్తుల వివరాలు, జయ మరణం తర్వాత ఆమెకు చెందిన ఆస్తుల పర్యవేక్షణ ఎవరి చేతుల్లో ఉన్నాయో, పత్రిక, టీవీ ఛానళ్లు, సిరుదాపూర్ బంగాల్, కొడనాడు ఎస్టేట్, మిడాస్ లిక్కర్ వంటి వాటి వివరాలను సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది.
శశికళ బినామీలు ఎవరు?
శశికళ బినామీలు ఎవరెవరు ఉన్నారనే అంశంపై ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. అందర్నీ రాజకీయంగా, ఆర్థికంగా దెబ్బతీసే రీతిలో దాడులు జరిగే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోందని అంటున్నారు.
మన్నార్గుడి.. శశికళ బంధువులపై ఐటీ దాడులకు ఛాన్స్
ప్రస్తుతం అన్నాడీఎంకేకు దినకరన్ను దూరం చేసిన దృష్ట్యా, తదుపరి టార్గెట్ చిన్నమ్మ కుటుంబానికి చెందిన వివేక్, వెంకటేష్, శివకుమార్, అనురాధ, దివాకరన్లుగా ప్రచారం సాగుతోంది. వారిపై ఐటీ దాడులు జరిగే అవకాశముందంటున్నారు.