పసిగుడ్డును టాయ్లెట్ లో పడేసి హత్య: తల్లే హంతకురాలు..
రెండో కాన్పులోను ఆడపిల్లే పుట్టిందన్న కోపంతో.. ఆరు రోజుల పసిగుడ్డును ఓ తల్లి హత్య చేసింది.
పాట్నా: దేశంలో లింగ వివక్షత ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి అద్దం పట్టే ఘటన ఇది. ఆడపిల్ల పుట్టిందని హైరానా చేసే మగవారే కాదు.. తమ కడుపున ఆడపిల్ల పుట్టడం జీర్ణించుకోలేని మహిళలకు మన దేశంలో కొదువలేదు.
తాజాగా బీహార్ లోని సమస్తిపూర్ లో జరిగిన ఘటన దీనికి అద్దంపడుతోంది. రెండో కాన్పులోను ఆడపిల్లే పుట్టిందన్న కోపంతో.. ఆరు రోజుల పసిగుడ్డును ఓ తల్లి హత్య చేసింది. టాయ్ లెట్ ఫ్లష్ ట్యాంకులో పడేసి మాతృత్వానికే మాయని మచ్చ తీసుకొచ్చింది.
సమస్తిపూర్ లో పింకీదేవి అనే మహిళ ఈ ఘాతుకానికి పాల్పడింది. పాప కనిపించకపోవడంతో ఇంట్లోవాళ్లంతా వెతకం మొదలుపెట్టారు. ఎవరైనా ఎత్తుకెళ్లడమో.. లేక ఏదైనా జంతువు నోట కరుచుకుని వెళ్లడమో జరిగుంటుందని పింకీదేవి కుటుంబ సభ్యులను మభ్యపెట్టే ప్రయత్నం చేసింది.
అయితే పదే పదే పింకీ దేవి టాయ్ లెట్లోకి వెళ్లడాన్ని గమనించిన ఆమె అత్త.. అందులోకి వెళ్లి అసలేం జరిగిందో పరిశీలించింది. టాయ్ లెట్ ఫ్లష్ ట్యాంకు మూత సరిగా లేకపోవడంతో.. దాన్ని తెరిచి చూడగా.. అందులో పసిపాప విగతజీవిగా కనిపించింది.
అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పింకీదేవిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే పోలీసులతో కూడా పాపను తాను చంపలేదని పింకీ వాదిస్తోంది. దీంతో ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.