10 నెలల్లో 5 సార్లు గర్భిణీ అయిన 60 ఏళ్ల బామ్మ
లక్నో: 10 నెలల్లో ఒకే మహిళ ఐదు సార్లు గర్భిణీ ధరించిందని మీరు ఎప్పుడైనా విన్నారా? కానీ ఇది నిజం. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘జననీ సురక్ష యోజన' పథకం ఎంత స్థాయిలో దుర్వినియోగం అవుతోందో చెప్పడానికి ఇది నిదర్శనం.
‘జననీ సురక్ష యోజన' పథకాన్ని ఉత్తరప్రదేశ్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఉద్యోగుల అవినీతిమయం చేసేశారు. ప్రసవించిన తర్వాత మంచి పోషక విలువల గల ఆహారం తీసుకోవడానికి గర్భిణిలకు డబ్బుల అందించడం కోసమే యూపీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.
ఈ పథకాన్ని ఉపయోగించుకుని అక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఉద్యోగులు భారీగా అక్రమాలకు పాల్పడ్డారు. వీరి అక్రమాలు ఏ స్ధాయికి దిగజారాయంటే ‘60ఏళ్ల ఓ మహిళ పది నెలల్లో ఐదు సార్లు గర్భం దాల్చింద'ని రికార్డు ఫైల్ చేసి డబ్బులు తీసుకున్నారు.
అంతేకాదు పెళ్లి కాకుండానే మరో మహిళ నాలుగు నెలల్లో మూడు సార్లు గర్భం దాల్చిందని రికార్డులు సృష్టించారు. మరో వివాహితకు గర్భం దాల్చకుండానే 12 సంవత్సరాల పాటు 1,400 రూపాయలను అక్కడి హెల్త్ డిపార్ట్మెంట్ చెల్లించింది.
‘జననీ సురక్ష యోజన' పథకాన్ని 2005లో యూపీ ప్రభుత్వం ప్రారంభించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మనిచ్చిన నిరుపేదల పిల్లలకు పౌష్ఠికాహారాన్ని అందించే ఉద్దేశ్యంతో వారికి ఈ పథకం కింద రూ. 1,400 ఇస్తారు.
ఉత్తరప్రదేశ్లోని బౌంది పీహెచ్సీ పరిధిలోని ఇలాంటి కేసులు ఇప్పటికే 200 వరకు నమోదయ్యాయి. ఈ భారీ స్కాంకు సంబంధించి ఇప్పటికే ఐదుగురు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీనిపై జిల్లా కోర్టు సమగ్ర విచారణకు ఆదేశించింది.