8రోజులపాటు కూతురుపై గ్యాంగ్రేప్: కోర్టును ఆశ్రయించిన తల్లి
చెన్నై: తమిళనాడులోని చెన్నైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 22ఏళ్ల యువతిపై 8రోజులపాటు కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో తీవ్ర అనారోగ్యానికి గురైన ఆ యువతి డిసెంబర్ 4న మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.
తమ కూతురుకు మృతికి కారణమైన నిందితులపై చర్యలు తీసుకోవాలని, ఘటనపై సిబి సిఐడి విచారణ జరిపించాలని కోరుతూ బాధితురాలి తల్లి వి శాంత మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. బాధితురాలి తల్లి శాంత కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఆమె కోర్టుకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. నగరంలోని ఓ షాపులో పని చేస్తున్న తన కూతురు నవంబర్ 24న అదృశ్యమైంది.
తన కుమారుడు, పోలీసుల సహాయంతో తన కూతురును డిసెంబర్ 2న విల్లుపురం జిల్లాలోని కల్కూరిచి రక్షించారని శాంత తెలిపింది. అప్పటికే తన కూతురుపై దుండగులు ఎనిమిదిరోజులపాటు అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని కోర్టుకు తెలిపింది. తీవ్ర అనారోగ్యానికి గురైన తన కూతురును ప్రభుత్వ ఆస్పత్రికే తరలించారని పోలీసులు తనపై ఒత్తిడి తెచ్చారని పేర్కొంది.
పరిస్థితి విషమించడంతో చివరకు స్టాన్లీ ఆస్పత్రికి తరలించామని, అక్కడే చికిత్స పొందుతూ తన కూతురు మృతి చెందిందని శాంత కోర్టుకు తెలిపింది. ఎలిఫెంట్ గేట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ జరిగిన ఘటనపై తన ఫిర్యాదు స్వీకరించలేదని పేర్కొంది. దీంతో సాయం కోసం మహిళా సంఘాన్ని ఆశ్రయించినట్లు తెలిపింది.
ఎలిఫెంట్ గేట్ ఇన్స్పెక్టర్, ఎస్ఐలు నిందితులను రక్షించేందుకే తమ ఫిర్యాదు స్వీకరించలేదని బాధితురాలి తల్లి పేర్కొంది. కాగా, నిందితులలో ఫ్రాన్సిస్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడికి బెయిల్ ఇవ్వకూడదని, కేసును సిబి సిఐడికి అప్పగించాలని బాధితురాలి తల్లి శాంత మద్రాసు హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. మురళీ, శంకర్, అన్నమలై అనే మరో ముగ్గురు నిందితుల పేర్లను కూడా బాధితురాలు చనిపోయే ముందు వెల్లడించింది. మరికొందరి పేర్లు తనకు తెలియదని పేర్కొంది.