కన్న కూతురినే.. వ్యభిచార ముఠాకు!: చాకచక్యంగా బయటపడ్డ బాలిక
ప్రియుడితో కలిసి కన్న కూతురిని వేశ్యావాటికకు విక్రయించాలని చూసిన ఓ తల్లి ప్రయత్నానికి పోలీసులు చెక్ పెట్టారు.
బీదర్: ప్రియుడితో కలిసి కన్న కూతురిని వేశ్యావాటికకు విక్రయించాలని చూసిన ఓ తల్లి ప్రయత్నానికి పోలీసులు చెక్ పెట్టారు. బాధితురాలు పక్కింటివారికి సమాచారం అందించడంతో.. విషయం పోలీసులు దాకా వెళ్లి బాలికను రక్షించేలా చేసింది. కర్ణాటకలోని బీదర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బీదర్ పట్టణంలోని ఓ కాలేజీలో చదువుతున్న బాలిక(17), తల్లి, చెల్లెళ్లతో కలిసి నగర శివారులోని ఓ లేఅవుట్ లో ఉంటోంది. కొద్దిరోజుల క్రితం మహిళ ప్రవర్తనతో విసుగుచెందిన భర్త.. ఆమెను వదిలి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటినుంచి ఖాజామియా అనే వేరే వ్యక్తి బాలిక తల్లి వివాహేతర సంబంధం పెట్టుకుంది.
తరుచూ ఇంటికి వచ్చే ఖాజామియా.. ముగ్గురు ఆడపిల్లలను ఎప్పుడూ దూషిస్తుండేవాడు. ఇదే క్రమంలో సులువుగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో ముగ్గురు ఆడపిల్లల్లో పెద్దమ్మాయిని ఎవరికైనా విక్రయించాలని భావించారు. ఇందుకోసం రాజస్థాన్ కు చెందిన ఓ వ్యక్తితో డీల్ కుదుర్చుకున్నారు.
బుధవారం బాలిక కాలేజీ నుంచి ఇంటికి రాగానే.. త్వరగా దుస్తులు మార్చుకోవాలని, పెళ్లి సంబంధం వచ్చిందని హడావుడి చేశారు. కొద్దిసేపటికే ఖాజామియా బాలికను తీసుకువస్తున్నామని, వెంటనే తన బ్యాంకు ఖాతాలోకి రూ.2లక్షలు జమ చేయాలని వేరే వ్యక్తితో ఫోన్ లో మాట్లాడాడు. ఈ విషయాన్ని బాలిక గమనించింది. వెంటనే తమ ఇంటి కిటికీ నుంచి పక్కింటివారికి సమాచారం అందించింది.
విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో.. బాలిక అమ్మకాన్ని అడ్డుకున్నట్లయింది. బాలిక తల్లి సహా ఆమె ప్రియుడు ఖాజామియాపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.