లోకసభ: బిజెపికి తొలి షాక్, మణిపూర్లో ఖాతా
భోపాల్: బిజెపికి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గట్టి షాక్ తగిలింది. ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీకి కోల్పోయింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రత్యేక దృష్టి పెట్టినా, మృతి చెందిన ఎంపీ కూతురు బరిలోకి దిగినా ఓడిపోవడం గమనార్హం.
గతేడాది లోకసభ ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన తర్వాత బిజెపి తొలిసారిగా ఒక లోకసభ స్థానాన్ని కోల్పోయింది. రాష్ట్రంలోని రాత్లాం ఝాబువా స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఆ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని చేజార్చుకుంది.
అంతకుముందు ఢిల్లీ, ఇటీవల బీహార్ ఎన్నికల పరాభవం తర్వాత బిజెపికి తగిలిన మరోదెబ్బగా చెప్పవచ్చు. 2014 ఎన్నికల్లో రాత్లాం-ఝాబువా (ఎస్టీ) నుంచి బిజెపి తరఫున దిలీప్ సింగ్ భూరియా విజయం సాధించారు. ఇటీవల ఆయన మరణంతో ఉప ఎన్నిక వచ్చింది.
తండ్రికి వారసురాలిగా దిలీప్ సింగ్ కుమార్తె నిర్మలా భూరియా ఈసారి బిజెపి నుంచి పోటీ చేశారు. ఆమెపై కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీమంత్రి కాంతిలాల్ భూరియా బరిలోకి దికారు. సీఎం చౌహాన్ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. చౌహాన్ ప్రచారం లేదా దిలీప్ మరణం సానుభూతిగానీ బిజెపిని గెలిపించలేదు.
కాంతిలాల్ భూరియా 88,832 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆయన మాట్లాడుతూ... బిజెపి ఓటమి ఝాబువా నుంచి మొదలైందని, ఇది రాష్ట్రవ్యాప్తం, దేశవ్యాప్తమవుతుందని పేర్కొన్నారు. ఈ విజయంతో 543 సీట్లుండే లోకసభలో కాంగ్రెస్ ఎంపీల సంఖ్య 45కు పెరగగా, బిజెపి ఎంపీల సంఖ్య 281కి తగ్గింది.
కాగా, మధ్యప్రదేశ్లోని దేవాస్ అసెంబ్లీ స్థానాన్ని మాత్రం బిజెపి నిలబెట్టుకోగలిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే తుకోజిరావ్పురార్ మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. తుకోజిరావ్ భార్య గాయత్రిరాజెపురార్ కాంగ్రెస్ అభ్యర్థి జైప్రకాశ్ శాస్త్రిపై 30,778 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
మరోవైపు, మణిపూర్లో బిజెపి ఖాతా తెరిచింది. అరవై సీట్ల మణిపూర్ శాసనసభలో బిజెపి ఖాతా తెరిచింది. తంగ్మీబంద్, తోంగ్జు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించింది. ఈ రెండు కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ స్థానాలు. బిజెపి తరఫున జయకిషన్ సింగ్, విశ్వజిత్ సింగ్ గెలుపొందారు.