'రాహుల్ గాంధీ ఆచూకి చెప్పండి: రివార్డు కొట్టండి'
లక్నో: గత లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రధాని అభ్యర్థి అంటూ సొంత పార్టీ నేతల చేత జేజేలు కోట్టించుకున్న యువరాజు , ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తప్పిపోయాడని, ఆయన ఆచూకీ చెప్పండని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
రాహుల్ గాంధీ ఆచూకీ చెప్పిన వారికి బహుమానాలు అందిస్తామని కూడా ప్రకటించారు. రాహుల్ గాంధీ సొంత నియోజక వర్గం అమేథీలో సైతం ఇలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తమ ప్రాంతాలలో రోడ్లు మరమ్మతుకు నోచుకోవడం లేదని, తాగునీరు రావడం లేదని, విద్యుత్ సమస్య ఉందని ఫోటోలు తీసి ఫ్లెక్సీలలో వేశారు.
ఎవరైనా రాహుల్ గాంధీని గుర్తించి తమకు సమాచారం అందిస్తే తమ సమస్యలు తీరుతాయని అందుకు కృతజ్ఞతగా మీకు బహుమానాలు అందిస్తామని ఫ్లెక్సీలలో వేశారు. తాము ఓట్లు వేసి గెలిపిస్తే ఇటు వైపు తిరిగి చూడలేదంటూ అమేథీ లోక్ సభ నియోజక వర్గంలో ఉన్న వారు ఆరోపిస్తున్నారు.
రాహుల్ తిరిగి రావాలంటూ ఏకంగా పాట రాయించి రికార్డు చేయించారు. జానే వో కౌన్సా దేశ్, జాన్ తుమ్ చలే గయే అంటూ ఒక పాట కట్టి ప్రజల మధ్యకు వెళ్లి పాడుతున్నారు. గత నెల రోజుల నుండి రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నారు, ఎక్కడికి వెళ్లారు అని సమాచారం లేకపోవడంతో ఈ విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.