జమ్మూ సీఎంగా ముఫ్తీ ప్రమాణం, హాజరైన ప్రధాని మోడీ.. కేబినెట్లోకి తొలిసారి బీజేపీ
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా ముఫ్తీ మహమ్మద్ సయీద్ ప్రమాణస్వీకారం చేశారు. ముఫ్తీ మహమ్మద్ సయీద్ చేత జమ్మూకాశ్మీర్ గవర్నర్ ఎన్వీ వోహ్ర ప్రమాణస్వీకారం చేయించారు. ముఫ్తీతో పాటు మరో 25 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
బీజేపీ పార్టీకి చెందిన నేత నిర్మల్ సింగ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఫ్తీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు హోంమంత్రి రాజ్నాథ్సింగ్, భాజపా అగ్రనేత ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్జోషిలతో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జమ్మూ యూనివర్సిటీలోని జనరల్ జోర్వార్ సింగ్ ఆడిటోరియంలో జరిగింది. గత ఏడాది డిసెంబర్లో జమ్మూకశ్మీర్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో పీడీపీ 28, బీజేపీ 25 స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే.
దీంతో కొన్ని రోజుల పాటు ప్రభుత్వ ఏర్పాటులో సందిగ్ధం నెలకొంది. చివరకు బీజేపీ, పీడీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు సంఖ్య 87. ప్రమాణ స్వీకార అనంతరం ముఫ్తీ మాట్లాడుతూ.. జమ్మూకాశ్మీర్ ప్రజలకు సుపరిపాలన అందించడమే తమ ధ్యేయమని ముఫ్తీ స్పష్టం చేశారు.
గతం కంటే భవిష్యత్తుకే ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్కు కేంద్ర బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చినందుకు కేంద్రానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.