ములాయంకు షాక్: మాయావతి గూటికి ఆయన సన్నిహితుడు..
ఎస్పీలో తన సభ్యత్వం సహా అన్నింటికి రాజీనామా చేసేశానని, ఇకనుంచి బీఎస్పీ తరుపునే పూర్తి స్థాయి రాజకీయ కార్యాచరణలో పాల్గొంటానని అంబికా చౌదరి తెలిపారు.
లక్నో: ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారుతోంది. తాజాగా ములాయంకు అత్యంత సన్నిహితుడు, విధేయుడైన పార్టీ సీనియర్ నేత అంబికా చౌదరి ఆ పార్టీకి గుడ్ బై చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.
సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) నుంచి బయటకొచ్చిన అంబికా చౌదరి శనివారం ఉదయం బీఎస్పీ అధినేత్రి మాయవతి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఎస్పీలో తండ్రీ-కొడుకుల నడుమ నెలకొన్న వివాదంపై ఆయన స్పందించారు. ఎస్పీ అధినేత ములాయం పట్ల తనయుడు అఖిలేష్ అవమానకరంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
ఎస్పీలో తన సభ్యత్వం సహా అన్నింటికి రాజీనామా చేసేశానని, ఇకనుంచి బీఎస్పీ తరుపునే పూర్తి స్థాయి రాజకీయ కార్యాచరణలో పాల్గొంటానని అంబికా చౌదరి తెలిపారు. అంబికా చౌదరి ఎస్పీని వీడటం ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ అని.. అదే సమయంలో బీఎస్పీకి కలిసొచ్చే అంశమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
కాగా, బలియాలోని రాస్రా నియోజకవర్గం నుంచి బీఎస్పీ తరుపున అంబికా చౌదరి పోటీ చేయనున్నారు. ఇదిలా ఉంటే, మొత్తం ఏడు దశల్లో జరగనున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ఈసీ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 11 నుంచి ఈ ఎన్నికలు ప్రారంభంకానున్నాయి.