విషాదం: యువకుడి ప్రాణాలు తీసిన పది రూపాయలు
ముంబై: పది రూపాయల కోసం జరిగిన గొడవలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని ముంబైలో మంగళవారం చోటు చేసుకుంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, నిందితులను అరెస్ట్ చేశారు.
పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఫిరోజ్ షేక్(35) అనే యువకుడు చికెన్ షాపు నడుపుతున్నాడు. వడ పావ్ షాపులో పని చేసే నిందితులు కుందన్ చౌదరి, సంజయ్ భారతి, దామోదర్ సాహులు షేక్ షాపులో రూ. 105ల చికెన్ తీసుకున్నారు. అయితే షేక్ దీనికి రూ. 115 వసూలు చేశాడు. దీంతో రూ. 10 కోసం వివాదం చెలరేగింది.
షేక్తో వాగ్వాదానికి దిగిన నిందితులు.. ఆ తర్వాత అతనిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన షేక్ స్పృహ కోల్పోయాడు. గమనించిన స్థానికులు నిందితుల్లో కుందన్ చౌదరిని పట్టుకున్నారు. కాగా, మిగిలిన ఇద్దరు నిందితులు సంజయ్, దామోదర్ సాహులు అక్కడ్నుంచి పరారయ్యారు.
షేక్ను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, చౌదరిని అరెస్ట్ చేశారు. మిగిలిన ఇద్దరు నిందితులను వారి నివాసాల్లో అదుపులోకి తీసుకున్నారు.