విడాకులు తీసుకుంటున్నాం, లాస్ట్ టైం కలుసుకుందామని.. ఘోరం
విడాకులు తీసుకోబోతున్నామని, కాబట్టి చివరిసారి ప్రేమతో చికెన్ ఫ్రై చేసి పెడతానని చెప్పిన ఓ భర్త.. భార్య ముఖంపై వేడి వేడి నూనె పోసిన సంఘటన ముంబైలో చోటు చేసుకుంది.
ముంబయి: విడాకులు తీసుకోబోతున్నామని, కాబట్టి చివరిసారి ప్రేమతో చికెన్ ఫ్రై చేసి పెడతానని చెప్పిన ఓ భర్త.. భార్య ముఖంపై వేడి వేడి నూనె పోసిన సంఘటన ముంబైలో చోటు చేసుకుంది.
ముంబయికి చెందిన షదాబ్ అలీ ఇర్షాద్ షేక్ (31), మరియం మధ్య మనస్పర్థలు రావడంతో రెండు నెలలుగా విడివిడిగా ఉంటున్నారు. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన భార్య మరియం విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది.
ఆ దంపతులకు ఓ కొడుకు ఉన్నాడు. ఆమెపై కోపాన్ని పెంచుకున్న భర్త ఓ రోజు భార్య మరియం ఉంటున్న ప్రాంతానికి వెళ్లాడు. చివరిసారి ఏకాంతంగా కలుసుకుందామని, నీకు స్వయంగా చికెన్ ఫ్రై చేసి పెడతాను రమ్మని ఇంటికి పిలిచాడు.
భర్త ప్రేమగా పిలవడంతో అతని ఇంటికి వెళ్లింది. ఆమె ఇంటికి రాగానే చికెన్ ఫ్రై చేసేందుకు వేడి చేసిన నూనెను మరియం ముఖంపై పోశాడు. దీంతో ఆమె ముఖం బాగా కాలిపోయింది.
ఆమెపై దాడి చేసిన అనంతరం షేక్ సరాసరి పోలీస్ స్టేషన్కు వెళ్లి జరిగిందంతా చెప్పి లొంగిపోయాడు. అతడ్ని పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన బుధవారం చోటు చేసుకుంది.