డెలివరీ సమయంలో డాక్టర్ నిర్లక్ష్యం: 19 లక్షలు జరిమానా విధించిన వినియోగదారుల ఫోరం
ముంబై: కడుపులో ఉన్న బిడ్డ మృతికి కారణమయ్యాడని ఓ డాక్టర్కి ముంబై సబర్బన్ జిల్లా వినియోగదారుల పరిష్కార ఫోరం భారీ జరిమానా విధించింది. బిడ్డను కోల్పోయిన ఆ తల్లిక రూ. 19 లక్షలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.
వివరాల్లోకి వెళితే, 2003లో ముంబైలో సోనూ కరీర్ అనే గర్భవతి మాతృశయా అనే ఆసుపత్రికి తరచూ పరీక్షల కోసం వెళ్తుండేది. అక్టోబర్ 18న తీవ్ర నొప్పులతో అదే ఆసుపత్రికి వెళ్లినప్పుడు వైద్యుడు వెంటనే మరో ఆసుపత్రిలో చేర్పించాలని చెప్పాడు. దీంతో పాటు ఏ క్షణంలోనైనా బిడ్డ జన్మించవచ్చని తెలిపాడు.
దీంతో వెంటనే అక్కడి నుంచి సమీపంలోని కందివిలిలోని మరో ఆసుపత్రికి వెళ్లారు. ఆసుపత్రిలోని డాక్టర్ నాలుగు గంటలు ఆలస్యంగా రావడంతో పాటు పరీక్షలు నిర్వహించి మరో పదిహేను నిమిషాల్లో ఆమె డెలివరీ అవుతుందని ఇంటికి వెళ్లిపోయాడు.
ఆమె డెలివరీని నర్సే దగ్గరుండి చూసింది. అనంతరం వచ్చిన డాక్టర్ బేబిని చిన్న పిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పగా, మార్గం మధ్యలోనే బేబి చనిపోయింది. దీంతో బాధితురాలు తండ్రి పంకజ్ ఆమె తరుపున వినియోగదారుల ఫోరంను సంప్రదించారు.
బాధితురాలి వాదనలు విన్న వినియోగదారుల ఫోరం కందివిలి డాక్టర్ ముమ్మాటికీ అశ్రధ్ధ చేశారని, ఫలితంగా రూ. 19 లక్షలు చెల్లించాల్సిందేనని ఫోరం ఆదేశించింది. బేబీ చనిపోవడానికి ఆ డాక్టర్ నిర్లక్ష్యమే కారణమని స్పష్టం చేసింది.