ఏమైంది?: తాళి కడుతున్న వేళ పెళ్లి మండపంలోకి పోలీసులతో యువతి
అచ్చం సినిమాల్లోలాగే పెళ్లి మండపంలో వధువుకు వరుడు తాళి కడుతున్న సమయంలోనే ‘పెళ్లి ఆపండీ’ అంటూ ఓ యువతి పోలీసులను వెంటేసుకుని అడుగుపెట్టింది. ఆ తర్వాత పోలీసులు వరుడ్ని అరెస్ట్ చేయడంతో పెళ్లి ఆగిపోయింది.
ముంబై: మనం సినిమాల్లో చూసే సంఘటనలు అప్పుడప్పుడు నిజ జీవితంలోనూ చూడాల్సి వస్తుంది. ఇక్కడ కూడా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. అచ్చం సినిమాల్లోలాగే పెళ్లి మండపంలో వధువుకు వరుడు తాళి కడుతున్న సమయంలోనే 'పెళ్లి ఆపండీ' అంటూ ఓ యువతి పోలీసులను వెంటేసుకుని అడుగుపెట్టింది. ఆ తర్వాత పోలీసులు వరుడ్ని అరెస్ట్ చేయడంతో పెళ్లి ఆగిపోయింది. ముంబైలోని బైసర్ ప్రాంతంలో చోటుచేసుకుందీ ఘటన
వివరాల్లోకి వెళితే.. ముంబైలోని బైసర్ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువకుడు తన బంధువైన 24 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకుంటానని చెబుతూ గత ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. అయితే, గత కొద్ది రోజులుగా ఆమెకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. అంతేగాక, గుట్టుగా మరో యువతిని వివాహం చేసుకునేందుకు గుట్టుచప్పుడు కాకుండా ఏర్పాట్లు చేసుకున్నాడు.
ఈ విషయం ఆమెకు ఎలాగోలా తెలియడంతో చివరి క్షణంలో ఆమె పోలీసులను ఆశ్రయించింది. చిన్ననాటి నుంచే పరిచయం ఉన్న తామిద్దరం ప్రేమించుకున్నామని, అందుకే సహజీవనం చేశామని తెలిపింది. తనను పెళ్లి చేసుకుంటానన్నాడు కనుకే తాను సహజీవనం చేశానని ఆమె పోలీసులకు తెలిపింది.
దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, సరిగ్గా తాళి కట్టే సమయానికి కల్యాణ మంటపంలోకి ఎంట్రీ ఇచ్చి... 'ఆపండి' అంటూ పీటల మీద ఉన్న పెళ్లి కొడుక్కి సంకెళ్లు వేశారు. ఆరేళ్లుగా ఆ యువతిపై అతను అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. నిందితుడిపై మోసం, అత్యాచారం కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు.