ఎన్డీఏపై విరుచుకుపడిన సోనియా, మన్మోహన్, రాహుల్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి చెందిన 25మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీనియర్ ఎంపి మల్లిఖార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వం విరుచుకుపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలు కట్టుకుని నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా సోనియా గాంధీ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిందని తీవ్రంగా స్పందించారు. మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? అని ఆమె ప్రశ్నించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ.. ఎంపీల సస్పెన్షన్ అప్రజాస్వామిక చర్య అని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎంపీ మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ.. ఎంపీల సస్పెన్షన్ ప్రజాస్వామికని చీకటి రోజని అన్నారు. ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేసి అప్రజాస్వామికంగా పార్లమెంటును కొనసాగిస్తున్నారని ఆరోపించారు.
రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. 25మంది ఎంపీలను సస్పెన్షన్ చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని మండిపడ్డారు. సభను నడపడం ప్రభుత్వానికి చేతకావడం లేదని దుయ్యబట్టారు. ‘మన్ కీ బాత్'లో మనసులోని మాటను ప్రజలతో పంచుకునే మోడీ.. అంతకంటే ముందు ప్రజల మనసులో ఏముందో తెలుసుకోవాలని రాహుల్ చురకలంటించారు.
లలిత్ మోడీకి సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో రాజస్థాన్ సిఎం వసుంధర రాజేకు భాగస్వామ్యం ఉందనీ, బ్రిటన్లో లలిత్ మోడీకి విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సహకారం అందిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేసిందని కాంగ్రెస్ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు.